ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షల నుంచి మానవతాసాయాన్ని మినహాయించేందుకు రూపొందించిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. ఈ తీర్మానం వల్ల పాకిస్తాన్ వంటి దేశాల్లోని ఉగ్రసంస్థలు మరింత బలపడుతాయని భారత్ వాదించింది. తీర్మానంపై ఓటింగ్ కు దూరంగా ఉంది. మినహాయింపులను అదనుగా చేసుకుని ఉగ్రసంస్థలు నిధులు సమకూర్చుకుంటాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐరాస భద్రతామండలికి భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. మానవతా చర్యలను మినహాయిస్తూ ఆంక్షలు రూపొందించేందుకు చేసిన తీర్మానాన్ని అమెరికా, ఐర్లండ్ లు భద్రతామండలిలో ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం వల్ల ఆంక్షలు అమల్లో ఉన్న దేశాల్లో …మానవతా సాయం అందడంతో పాటు నిధుల చెల్లింపులు చేయడం, ఆర్థిక వనరులు, ఆస్తులను వినియోగించుకునే వీలు లభిస్తుంది. 15 భద్రతామండలి
సభ్య దేశాల్లో 14 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా భారత్ మాత్రమే ఓటింగ్ దూరంగా ఉంది. ఇలాంటి మానవతా మినహాయింపుల నుంచి ఉగ్రసంస్థలే పూర్తిగా లబ్దిపొందిన ఘటనలు, సందర్భాలున్నాయని.. తాజా తీర్మానంతో పాకిస్తాన్ లోని నిషేధిత ఉగ్రసంస్థలు….హక్కుల సంఘాల ముసుగులో ఆంక్షలనుంచి తప్పించుకుంటూ వస్తున్నాయన్నారు. ఆంక్షలు అమల్లో ఉన్న సంస్థలు, దేశాలకు ఇలాంటి సాయం చేసే ముందు ప్రపంచ దేశాలు పునరాలోచించాలని భద్రతామండలి భారత్ అధ్యక్షురాలు , ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు.