న్యాయవ్యవస్థకు సంబంధించి ఈ వారంలో రెండు ఆసక్తికర పరిణామాలు మనం చూశాం. ఒకటేమో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అలాగే ఇస్లాం క్రైస్తవ మతాలలోకిమారిన దళితులకు రిజర్వేషన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ రెండు విషయాలపై కాస్త లోతుగా వెళ్లి మాట్లాడుకుందాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకంగా నిలిచిపోనుంది. అన్ని చరిత్రాత్మక నిర్ణయాలు వివాదరహితం కావు. చరిత్ర అంటేనే పరస్పరం సంఘర్షించే శక్తుల సమరాంగణం కాబట్టి, ప్రతి చరిత్రాత్మక నిర్ణయానికి విరుద్ధమైన వ్యాఖ్యానాలు ఉండటం అసాధారణం అసలే కాదు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించటానికి తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణతో కులం పునాదిని పక్కనపెట్టారు. ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల కేటగిరిలో లేని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ రంగాల్లో 10 శాతం కేటాయించటం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం కాదని తేల్చటమే కాకుండా, ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికగా రిజర్వేషన్లను కల్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సామాజికంగా విద్యాపరంగా వెనుకబాటు తనం అనేది ఇకపై రిజర్వేషన్ల కల్పనకు ఏకైక పునాదిగా ఉండదు.
1960ల్లోనే ఎం.ఎన్. శ్రీనివాస్ తన ‘సోషల్ ఛేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా’ పుస్తకంలో ఈ పరిణామాలను చాలా స్పష్టంగా వివరించారు. క్రీమీలేయర్ అనేది ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు వర్తిస్తోంది. దీన్ని తొలగించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. క్రీమీలేయర్ అంటేనే ఆర్థిక అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను వర్తింపచేయకుండా ఉండటం. ఓటు బ్యాంకు రాజకీయాలు కీలక విషయాలపై మౌనాన్ని వహించేటట్టు చేయటం మనకు కొత్తేమీ కాదు. ప్రతిభ, సమర్థత, మెరిటోక్రసీ, ఆర్థికాభివృద్ధి, గుడ్గవర్నెన్స్.. లాంటి వాటికి కొలమానాలన్నీ ఎక్కడనుంచో వస్తున్నాయి. ఆర్థిక ప్రాతిపదిక అనేది కూడా ఇన్కమ్ ఈక్వాలిటీ అన్న భావన నుంచే వచ్చింది. అన్ని కొలమానాలకు పాశ్చాత్య తీరం మూలమైనప్పుడు రిజర్వేషన్లకు వేరే తీరం ఉంటుందా? కాస్త ఆలస్యంగానైనా ఈ నావ కూడా ఆ తీరం రుచినే మరుగుతుందా?
సామాజిక న్యాయము-సాధికారత మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టు కి అఫిడవిట్ సమర్పించింది. ఇస్లాం, క్రైస్తవాలు.. హిందూ సమాజంలో బలహీనతలను ఆసరాగా తీసుకోని ప్రలోభాలతో దళితులను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దేశంలోని ప్రముఖ వ్యక్తులు రాజకీయ నాయకులు న్యాయస్థానాలు కూడా పదేపదే ఎత్తిచూపుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అబ్రహామిక్ మతాలైన ఇస్లాం, క్రైస్తవం రెండు కూడా విదేశీ మతాలు, విదేశీ మూలాలు కలిగి ఉన్నవి కాబట్టి ఆ మతాలలోకి మారిన దళితులకు, దళితులకు ఇచ్చే రిజర్వేషన్లు వర్తించవని పేర్కొంది. అబ్రహామిక్ మతాల లోకి మారిన వారి ఆలోచనలు , సనాతన ధర్మం లోని వారి మధ్య ఉన్న తేడాను స్పష్టం చేసింది. అట్లాగే భారతీయ మతాలైన హిందూ సిక్కు మరియు బౌద్ధంలోకి మారిన దళితులకు రిజర్వేషన్ సౌకర్యాలు ఇవ్వటాన్ని కూడా సమర్థించుకుంది.
సామాజిక న్యాయము- సాధికారత మంత్రిత్వ శాఖ మాటల ప్రకారం… సనాతన ధర్మం మరియు ఇతర మతాల వారి ఆరాధన ఆలోచనలో తేడా ఉండదు, ఆ మతాలలో కులాలు లేవు . భారత దేశంలోని ఇస్లాం, క్రైస్తవానికి విదేశీ విరాళాలు విస్తృతంగా వస్తుంటాయని అక్టోబర్ లో సుప్రీంకోర్టు కి సమర్పించిన అఫీడ్ విట్ లో పేర్కొంది. కులం గుర్తింపు భారతీయ మతాలైన బౌద్ధం సిక్ఖ మొదలైన వాటిలో స్పష్టంగా గుర్తించవచ్చు అందుకే అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించటం వెనుకసామాజిక రాజకీయ పరిణామాలు చాలా న్నాయి .
శతాబ్దాలుగా ఇతర మతాలలోకి మారిన భారతీయులకు కుల మూలాల గుర్తింపు లేదు ,ఆమతాలలోకి మారితే వాళ్ళ పేర్లుకూడా మారుతున్నాయి వారి మూలాలే మారుతున్నాయి , అందుకే వారి కులాల మూలాలను గుర్తించలేము. ఆ మారిన వాళ్లు ఆర్థిక ప్రలోభాల కారణంగానో మరియు ఇతర కారణాలవల్ల బలవంతంగా మార్చబడినవారే హిందూ మతంలో ఉన్న అంటరానితనం మొదలైన సామాజిక సమస్యలు అబ్రహామిక్ మతాలలో ఉండవని వాళ్ళు చెబుతారు. అందుకే రెండు మతాలలోకి మారినవారికి దళితులకు ఇచ్చే రిజర్వేషన్ లు వర్తించవు . మొత్తం మీద ఇస్లాం క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధం.
-రాంపెల్లి మల్లికార్జున్