గణతంత్రం: రామాలయం.. రాఫెల్ విన్యాసం
భారత గణతంత్ర దినోత్సవాల్లో ఈసారి అరుదైన దృశ్యాలు కనిపించాయి. శతాబ్దాల నాటి అయోధ్య రామజన్మభూమి వివాదం పరిష్కారం కావడంతో భవ్యమైన ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రామాలయ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామాయణ కావ్యకారుడు వాల్మీకి ప్రతిమ ప్రధానాకర్షణగా ఉత్తర్ ప్రదేశ్ శకటాన్ని రామాలయానికి అంకితం చేశారు. ఆలయ నిర్మాణ నమూనాను కూడా ఆవిష్కరించారు.
రామబాణానికి తిరుగుండదని అంటారు. అలాగే రాఫెల్ యుద్ధ విమానాలు కూడా అంతే. ఈసారి గణతంత్ర పరేడ్ లో రాఫెల్ విన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణ అయ్యాయి. రాఫెల్ యుద్ధవిమాన విన్యాసాలతో రాజ్ పథ్ లో రాష్ట్రపతికి సెల్యూట్ చేసే అవకాశం ఒక మహిళా పైలట్ కు దక్కింది. మహిళా సాధికారత దిశగా ఇది మరో ముందడుగు. వారణాసికి చెందిన ఫైల్ లెఫ్టినెంట్, 25 ఏళ్ల శివాంగి సింగ్ ఈ అరుదైన ఘనతక ఎంపికయ్యారు. లేపాక్షి కాన్సెప్టుతో ఆంధ్ర ప్రదేశ్ శకటం కూడా కనువిందు చేసింది. తొలిసారిగా లడఖ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆ కేంద్రపాలిత ప్రాంత శకటం మరో ఆకర్షణ. ఆర్టికల్ 379 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రం రెండుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లడఖ్ కేంద్ర ప్రాంతంగా ఆవిర్భవించింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వార్ మెమోరియల్ వద్ద అమర సైనికులకు పుష్పాంజలి ఘటించారు.