బీజేపీకి ఈసీ మళ్లీ ఝలక్.. వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై మోదీ ఫోటో తొలగించాల్సిందే.
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ చిత్రపటాలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్,అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రాలన్నింటిపై ఉన్న ప్రధాని చిత్రాలను తొలగించనున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికేట్స్పై ప్రధాని మోదీ చిత్రం ముద్రించి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగానే ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా ఈసీ లేఖ రాసింది.
కాగా, కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికేట్లో ప్రధాని చిత్రం ఉండటం.. కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ టీఎంసీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఫిర్యాదు మేరకు ఈసీ పై నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఇంతకు ముందు కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉన్న ప్రధాని ఫోటోలను కూడా తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. పెట్రోల్ బంకుల వద్ద కేంద్ర పథకాలను ప్రచారం చేసేందుకు ప్రధాని మోదీతో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉన్నాయని.. ఇవి ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయంటూ టీఎంసీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో వాటన్నింటిని వెంటనే తొలగించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.