బీజేపీ మాజీ నాయకురాలు నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. ప్రాణ హాని ఉందన్న ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ఆమె వినతి పిటిషన్కు సానుకూలంగా స్పందించింది. నూపుర్ పై దాఖలైన అన్ని కేసులన్నింటినీ కలిపి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ ఐఎఫ్ఎస్వో యూనిట్ కు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలను ఈరోజు సుప్రీం కోర్టు ఆదేశించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆమెను అరెస్ట్ చేయకూడదని తెలిపింది. అరెస్ట్ విషయంలో ఇప్పటిదాకా రక్షణ కల్పించిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని కోర్టు పేర్కొంది. తనకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయని.. అయితే విచారణ నిమిత్తం తాను అక్కడికి వెళ్తే తనపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నూపుర్ శర్మ సుప్రీం కోర్టులో వినతి పిటిషన్ వేసింది.
గతంలో ఇదే బెంచ్ ఈ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు జూలై 1న స్పందిస్తూ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహమ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలు చేసినందుకు మండిపడింది. ఆమె వ్యాఖ్యలు దేశంలో వివాదాలకు, హత్యలకు దారి తీశాయని పేర్కొంది. దేశంలో జరుగుతున్న సంఘటనలకు ఆమె మాత్రమే బాధ్యురాలని పేర్కొంది. ఉదయ్ పూర్లో కన్నయ్య లాల్ హత్యకు ఆమె వ్యాఖ్యలే కారణమని పేర్కొంది. నూపుర్ శర్మ జాతీయ టెలివిజన్ చానల్ లో యావత్తు దేశానికి క్షమాపణ చెప్పాలని తెలిపింది. ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పడానికి చాలా ఆలస్యం చేశారని పేర్కొంది.