దీపావళి పండగకు బహుమతిగానా అన్నట్టు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గించింది. పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై పదిరూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా… మొత్తం 13 రాష్ట్రాలు వాటిపై వ్యాట్ తగ్గించాయి. దీంతో వినియోగదారులకు మరింత ఉపశమనం లభించింది. అయితే దేశం మొత్తమ్మీద ఎక్కువగా వ్యాట్ విధిస్తూ వినియోగదారులపై పెను భారం మోపుతున్న రాష్ట్రాల్లో రెండు తెలుగురాష్ట్రాలుండడం గమనార్హం. మరి ఇక్కడేంటి సంగతి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వ్యాట్ తగ్గించి వినియోగదరాలకు కాస్తైనా ఉపశమనం కలిగించాలని ప్రతిపక్షాలూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ను ఈ పరిణామాలు చికాకు పెడుతున్నాయని చెప్పవచ్చు. ధరల తగ్గింపుపై కేంద్రాన్ని అభినందించకపోగా విమర్శలు చేయడంపై ఇరు రాష్ట్రాల బీజేపీ శాఖలూ మండిపడుతున్నాయి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి..మీకెందుకు సోయి లేదని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిలదీశారు.
ప్రతిదానికి కేంద్రంపై విమర్శలు చేసే తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు…మోదీ ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించినప్పుడు రాష్ట్రాల్లో ఎందుకు తగ్గించరని సామాన్యులూ అడుగుతున్నారు. తెలంగాణాలో లీటర్ కు 26 రూపాయలు, ఏపీలో 36 రూపాయల వ్యాట్ వసూలు చేస్తున్నారు.