ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ మీద బాగా చర్చ రేగుతోంది. యువగళం పేరుతో పాదయాత్ర చేసిన తెలుగుదేశం అగ్రనేత నారా లోకేష్ మొదటిసారి రెడ్ బుక్కు ప్రస్తావని తెచ్చారు ఈ రెడ్ బుక్కులో అక్రమాలు చేస్తున్న అధికారుల పేర్లను నమోదు చేసుకున్నట్లు పదే పదే వెల్లడించారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన అప్పట్లోనే తేల్చి చెప్పారు దీనిమీద అప్పటి సీఐడీ అధికారులు కోర్టు కేసులు కూడా పెట్టడం జరిగింది.
ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెడ్బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి.. ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దానిమీద చర్చలు జరుగుతున్నాయి.
ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులు అనేవి తమ ప్రభుత్వంలో ఉండవని స్పష్టం చేశారు. అప్పుడే చాలా మందిలో ఇక రెడ్ బుక్ ను అమలు చేయరా అని ప్రశ్నించారు. కానీ కక్ష సాధింపులు ఉుండబోవని చెప్పాను కానీ..తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అంటున్నారు. అంటే రెడ్ బుక్ అమలు జరిగి తీరుతుందని చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు ప్రారంభమయింది.
ప్రతిపక్షంలో ఉండగా కొంత మంది అధికారులు వ్యవహరించిన తీరు.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదంటున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అదికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ చాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరిగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బోకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహం ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సీఐడీ చీప్ గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవు పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామాంజనేలు, సీనియర్ ఐపీఎస్.. చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు . ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని భావిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీీడిపీ నేతలు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా యాభై రోజులకుపైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో అధికారుల మీద కీలక వ్యాఖ్యలు చేసింది. సీఐడీ చీఫ్ గా ఇద్దరు సీనియర్ ఐపీఎస్లు పని చేశారు. ఒకరు పీవీ సునీల్ కుమార్ కాగా.. మరొరకరు సంజయ్. వీరిద్దరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది. టీడీపీ నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
రెడ్ బుక్లో ఉన్న వారిలో ఉన్న డిప్యూటేషన్ అధికారులు కీలకం. జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ కీలక పదవుల్లో ఉండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారందరూ రిలీవ్ అవ్వాలన్నా అంగీకరించడం లేదు. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమను రిలీవ్ చేయాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్న డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులకు ఇదే చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై కేసుల్లో ప్రధాన వ్యక్తి. ఆయన తాను పోతానంటూ లెటర్ పెట్టుకున్నారు. గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి కూడా అదే చేశారు. వైసీపీ ప్రభుత్వం లో కీలక పాత్ర పోషించిన సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అంతా తాము తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పెట్టుకున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. తెలంగాణాకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ఎవర్నీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సెలవునుకూడా తిరస్కరించారు. సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.
మరోవైపు ఇటువంటి వ్యవహారాలు గతంలో కూడా జరిగాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. అధికారం మారిన ప్రతిసారి గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పని చేసిన అధికారులను టార్గెట్ చేయడం రివాజుగా మారిందని చెప్తున్నారు.