సుప్రీంకోర్టులో మహారాష్ట్ర రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తర్వాతి 3 రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి కోర్టు వాయిదా వేసింది. అంతేకాదు ఈరోజు సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏక్నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత, వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్ధవ్ సర్కార్ను ఆదేశించింది. జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.