మావోయిస్టు జాతీయ స్థాయి అగ్రనేత చలపతి ఎన్ కౌంటర్ లో హతం అయ్యారు. మావోయిస్టు దళాల మీద పోలీసులు చావు దెబ్బ తీసినట్లు లెక్క. ఒక్కొక్కరుగా అగ్రనేతలు చనిపోతుంటే, మరో వైపు రిక్రూట్ మెంట్లు లేక నక్సలిజం అంతర్థానం దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ నాయకుడు చలపతి చాలా కాలంగా పోలీసుల నుంచి తప్పించుకొంటున్నారు. కానీ ఆయన చేసిన చిన్న పొరపాటు తో ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. ఎంతో మంది చావుకి కారణం అయిన చలపతి కూడా అడవుల్లోనే భయంకరమైన చావుని చవి చూశాడు.
మావోయిస్టు అగ్రనేత చలపతి.. దళంలో ఉండే ఒక అమ్మాయిని చేరదీసి పెళ్లి చేసుకొన్నాడు. ఆమె కోరిక మీద స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ దిగారు. అదే అతని కొంప ముంచింది. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల అనంతరం అక్కడ మావోయిస్టులకు చెందిన ఒక స్మార్ట్ఫోన్ పోలీసుల చేతికి చిక్కింది. పోలీసులు ఆ ఫోన్లోని సమాచారాన్ని జల్లెడపట్టారు. అందులో మావోయిస్టు అగ్రనేత చలపతి తన భార్య అరుణతో కలిసి దిగిన ఒక సెల్ఫీ కనిపించింది. దాంతో ప్రస్తుతం చలపతి రూపం ఎలా ఉంటుందనేది పోలీసులకు తెలిసిపోయింది. ఎప్పుడో యువకుడిగా ఉన్నప్పుడు మావోయిస్టుల్లో చేరిన చలపతి ప్రస్తుత రూపురేఖలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం అప్పటిదాకా పోలీసులకు సవాల్ ఉండేది.
కానీ ఈ సెల్ఫీ సాయంతో చలపతి ఎలా ఉంటాడో తెలిసిపోయింది. ఆ సెల్ఫీనే రూ.1 కోటి రివార్డు కలిగిన చలపతిని పట్టుకునే దిశగా భద్రతా బలగాలను నడిపించింది. అయితే తన సెల్ఫీ పోలీసులకు దొరికిందని తెలిసినప్పటి నుంచి చలపతి అప్రమత్తమయ్యాడు. ఎక్కడికి వెళ్లినా తన వెంట పెద్ద సంఖ్యలో మావోయిస్టులను రక్షణగా తీసుకెళ్లేవాడు.ఈ క్రమంలోనే జనవరి 20 తెల్లవారుజామున మరో 13 మంది మావోయిస్టులతో కలిసి చలపతి వెళ్తుండగా ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆయనను, ఆయనతోపాటు ఉన్న మావోయిస్టులు అందరినీ మట్టుబెట్టాయి. సెల్ఫీలో ఉన్న ఫొటోతో మరణించిన మావోయిస్టుల్లోని ఒక వ్యక్తి ముఖం సరిపోలడంతో అతను చలపతిగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
చలపతి అసలు పేరు రామచంద్రారెడ్డి. ఆయనది ఉమ్మడి చిత్తూరు జిల్లా. 2008 ఫిబ్రవరి 15న ఒడిశాలోని నయాఘర్ జిల్లాలో భద్రతా బలగాలపై జరిగిన దాడికి అతనే సూత్రధారి. ఆ దాడిలో 13 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి స్కెచ్ వేస్తే చలపతి వ్యూహాలు చాలా పకడ్బందీగా ఉండేవి. నయాగఢ్ దాడికి ముందు కూడా మావోయిస్టులు అడవి లోపలికి వచ్చే అన్ని రోడ్లపై పెద్దపెద్ద చెట్లను, కర్ర దుంగలను అడ్డుగాపడేశారు. ఆ తర్వాత భద్రతా బలగాలపై దాడికి పాల్పడి, అక్కడి నుంచి పారిపోయారు.
మొత్తం మీద మావోయిస్టు అగ్రనేత చలపతి మరణంతో నక్సలిజం కు దెబ్బ తగిలింది. ఉద్యమం పేరు చెప్పి వేలాది మందిని పొట్టన పెట్టుకొన్న నక్సలైట్ ఉద్యమం.. ఇప్పుడు అగ్రనేతల ప్రాణాలు పోగొట్టుకోవట దిశగా ముందుకు సాగుతోంది.