80 వేల పుస్తకాల్లో ఏం చదివార్ సార్?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాను 80 వేల పుస్తకాలను చదివానని చెప్తుంటారు. అన్ని పుస్తకాలు చదివితే అపారమైన జ్నాన సంపద సొంతం కావాలి. అనేక విషయాలపై లాజికల్ గా ఆలోచించే శక్తి ఉండాలి. కానీ కెసిఆర్ ప్రతి విషయంలో తర్కానికి అందని విచిత్రమైన నిర్ణయాలను చేస్తున్నారు. ఉన్న సచివాలయాన్ని కూల్చడం నుంచి ఎన్నో విషయాల్లో అసంబద్ధమైన, అనాలోచిత నిర్ణయాలనే తీసుకోవడం ఆనవాయితీ అయింది. తాజాగా రైతుల పంట ఉత్పత్తుల కొనుగోలులోనూ అసంబద్ధమైన విధంగా మూడు రకాల యూటర్న్ తీసుకున్నారు.
బంగారు తెలంగాణ అనే నినాదం విన్న ప్రతిసారీ నిరుద్యోగులు, సామాన్యులు నిట్టూరుస్తున్నారు. కల్వకుంట్ల బంగారు కుటుంబంలో మాత్రమే చాలా మందికి పెద్ద పెద్ద పదవులనే ఉద్యోగాలు వచ్చాయి. ఎంత చదివినా సర్కారు కొలువు రాక నిరుద్యోగులు నిరాశలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కెసిఆర్ పాలనలో ఉపాధ్యాయుల నియామకాలు లేవు. ప్రతి ఏటా ఎంతో మంది రిటైర్ అవుతున్నా కొత్త వారి నియామకాలు లేవు. వలంటీర్లతో నెట్టుకొస్తున్నారు. విశ్వవిద్యాయాల్లో మరీ దారుణం. కనీసం వీసీలను నియమించే తీరిక కూడా ప్రభుత్వానికి లేనట్టుంది. వరద బాధితులను సీఎం ఎందుకు పరామర్శించలేదని మీడియా అడిగితే, ఆయనకు చాలా పనులుంటాయని ముఖ్యమైన మంత్రి కెటిఆర్ బల్దియా ఎన్నికలకు ముందు చెప్పారు. మరి యూనివర్సిటీలకు వీసీల నియామకం చేసే తీరిక కూడా లేదా అనేది ప్రశ్న. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు వీసీ పోస్టులే ఖాళీగా ఉంటే ఇక ఉన్నత చదువులు సరిగ్గా సాగేదెలా.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏకంగా 65 శాతం, అంటే మూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధన, బోధనేతర పోస్టులను కొన్నేళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇక బోధనేతర సిబ్బంది ఖాళీలు తెలంగాణ యూనివర్సిటీల్లోల మొత్తం మీద 15 వేలకు పైమాటే. విశ్వవిద్యాలయాల్లో అతి ముఖ్యమైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 5 వేలకు పైనే.
తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానం ఉండదు. అందరినీ పర్మినెంట్ చేస్తామనే మాటను కల్వకుంట్ల వారు మరిచినట్టున్నారు. అంతటా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ జమానాయే నడుస్తున్నది. విశ్వవిద్యాలయాలకు వీసీలుగా కూడా ఔట్ సోర్సింగ్ వాళ్లనే నియమిస్తారా అనే జోకులు వినవస్తున్నాయి. రెండేళ్లుగా వీసీలను నియమించే ఫుర్సత్ లేదా అంటే ఫాం హౌస్ నుండి జవాబు లేదు.
సినీ నటులను బల్దియా ఎన్నికలకు ముందు వారంలో రెండు సార్లు అధికారిక నివాసానికి పిలిపించుకుని కులాసా కబుర్లు చెప్పడానికి ముఖ్యమంత్రికి టైం దొరికింది. వరద బాధితుల పరామర్శకు, విద్యా వ్యవస్థలో అవసరమైన నియామకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాత్రం తీరిక లేనట్టుంది. అన్ని వేల పుస్తకాలు చదివిన మీకు అర్థమైంది ఇదేనా కెసిఆర్ సార్?