మహారాష్ట్రలో రాజకీయం గంటగంటకూ మలుపులు తిరుగుతోంది. తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే డిమాండ్ కు శివసేన తలొగ్గుతోంది. షిండేకే అధిక సంఖ్యా బలం ఉన్నట్టు తేలడంతో… మహా వికాస్ అఘాడీ కూటమి నుంచి వైదొలగేందుకే శివసేన సిద్ధమైంది. రెబెల్ ఎమ్మెల్యేలు 24 గంటల్లో ముంబై తిరిగి వస్తే..కూటమి నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామని…. సంజయ్ రౌత్ అన్నారు. ఠాక్రేతో చర్చిద్దామని అందరూ రావాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్యం లేకుండా తిరగవద్దని,బానిసత్వాన్ని అంగీకరించకుండా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుందామని…చర్చల ద్వారా సమస్యపరిష్కరించుకుందా..మీకు తలుపులు తెరిచి ఉన్నాయని రౌత్ ట్వీట్ చేశారు.
గురువారం మరో ముగ్గురు షిండే శిబిరంలోకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో తనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 46 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. 35 మంది సేన ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్కు సమర్పించారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు, వీడియో దిగి మీడియాకు సైతం విడుదలచేశారు షిండే.
ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా పార్టీని వీడాలంటే షిండేకు కనీసం 37మంది సభ్యుల మద్దతు కావల్సి ఉండగా..ఇప్పటికే ఆయనవైపు 46మంది ఉన్నారు. ఎమ్మెల్యేలే కాదు.. డజను మందికి పైగా శివసేన ఎంపీలు కూడా ఆయన వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఉద్ధవ్ కు తాను వ్యతిరేకం కాదని… కూటమి నుంచి వైదొలగి బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని షిండే శిబిరంలోని పలువురు వ్యాఖ్యానించడం విశేషం.
అసలైతే ఇప్పుడు చర్చలకు సిద్ధమంటున్న సంజయ్ రౌత్… నిన్నటి వరకు మీరు కావాలంటే బీజేపీలో చేరండి కానీ శివసేన మాతోనే ఉంటుందని తెగేసి చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేల డిమాండ్లకు తగ్గేది లేదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎటో వెళ్లిపోయినంతమాత్రాన పార్టీ పనైపోయినట్టు కాదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు. బాల్ ఠాక్రే హయాంలోనూ కొందరు పార్టీని వీడిన విషయాన్ని గుర్తు చేస్తూ..ఇది శివసేన భూమి… బాలాసాహెబ్ భూమి. మేం ఫీనిక్స్ పక్షిలా మళ్లీ లేస్తాం. పైకెగురుతాం అని రౌత్ వ్యాఖ్యానించారు. అయితే నిన్న సాయంత్రానికే రౌత్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించారు. ఇప్పుడు పూర్తిగా మెత్తబట్టారు.
“భారతదేశంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం పనిచేస్తుందా అనే సందేహం నాకు ఉంది! వారు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేస్తుంటే.. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఉద్ధవ్ ఠాక్రేకి న్యాయం జరగాలని మేం కోరుకుంటున్నాం. మహారాష్ట్ర తర్వాత మరో ప్రభుత్వాన్ని కూల్చేస్తారు” అని మమతా బెనర్జీ అన్నారు.
హవాలా డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు. మహారాష్ట్రలో జరుగుతున్నది నిజంగా దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు.