కేరళ లోని త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి నేలమాలిగల విషయం గుర్తుంది కదా. ఆ నేలమాలికలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నిధులు నగలు బయటపడ్డాయి. ఇప్పుడు అటువంటిదే మరొక ఘట్టం చోటు చేసుకోబోతోంది. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి దీనికి వేదికగా నిలుస్తోంది.
పూరీలోని జగన్నాథ స్వామి క్షేత్రము రథయాత్రకు పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం వచ్చే రథయాత్రలో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. దేవుడిని పూజించిన భక్తులు సమర్పించే ముడుపులు మొక్కుబడులు, కానుకలను దేవస్థానం భద్రపరుస్తుంది. అనేక సంవత్సరాలుగా పోగుపడిన ఈ నిధులన్నీ రత్న భాండాగారంలో ఉన్నట్లు చెబుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ రత్న భాండాగారాన్ని వచ్చే ఆదివారం నాడు తెరవబోతున్నారు.
పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై వివాదాలెన్నో నిలిచి ఉన్నాయి. అసలు తాళం ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్త ప్రభుత్వం దాన్ని తెరవాలని నిర్ణయించింది.
సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టనున్నారు.
భాండాగారాన్ని తెరిచే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ రెండో దఫా సమావేశం పూరీలో జరిగింది. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కమిటీలోని 16 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జస్టిస్ రథ్ విలేకరులతో మాట్లాడుతూ భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. రథయాత్ర పనిభారం వల్ల శ్రీక్షేత్ర పాలనాధికారి భాండాగారం డూప్లికేట్ తాళపుచెవిని కలెక్టరేట్లోని ట్రెజరీ నుంచి తీసుకురాలేదని, ఆయన 14న తమకు అందజేస్తారన్నారు. దాంతో తెరుచుకోకపోతే తాళంకప్ప పగలగొట్టి తలుపులు తెరవనున్నట్లు చెప్పారు.
నిజానికి ఇక్కడ కొన్ని సాంకేతిక అంశాలు కూడా దాగి ఉన్నాయి.
జగన్నాథుడికి చెందిన వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అటువంటప్పుడు ఈ ఆభరణాల బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. ప్రస్తుత కమిటీ సభ్యులకు నగల నాణ్యతపై అవగాహన లేదు. అందువల్ల ఈ కమిటీ పర్యవేక్షణకు మాత్రమే పరిమితం అవుతుంది. నిపుణుల సమక్షంలో అసలైన లెక్కింపు జరుగుతుంది. కానీ ఇక్కడే మరో విషయం కూడా గమనించాలి. భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉన్నందున నగల లెక్కింపు అక్కడే సాధ్యం కాదు. ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కిస్తారు. మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరం అని తెలుస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపడతారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకూ సంఘం సభ్యులందరూ శాకాహారం భుజిస్తూ, నియమ నిష్టలతో ఉండాలని నిర్ణయించుకున్నారు. స్వామివారి దర్శనాలకు భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ పాలకవర్గం, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పూరి జగన్నాథ దేవాలయంలో చాలా రహస్యాలు కనిపిస్తున్నాయి.
పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా, 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరి, వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కారు నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా, రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరిగారు. తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపుచెవి పూరీ కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో భాజపా ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది.
మొత్తం మీద పూరి క్షేత్రంలోని రత్న భాండాగారం తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ భాండాగారంలో ఎటువంటి నిధులు నగలు బయటపడతాయి అనేది సస్పెన్స్ గా నిలుస్తోంది.