విదేశాలనుంచి అధికారిక పర్యటనలకు వచ్చే అతిథులకు మన ప్రభుత్వాధినేతలు ఎక్కువగా ఇచ్చే బహుమతి ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్. అయితే మోదీ ప్రధాని ఆ సంప్రదాయాన్ని మార్చేశారు. భారతదేశపు సనాతన సంస్కృతీ సంప్రదాయాల్ని, ఆధునిక కళల్ని ప్రతిబింబించే అరుదైన వస్తురూపాల్ని బహూకరిస్తున్నారు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు ఆయన బహూకరించిన కృష్ణపంఖీ ఆకట్టుకుంటోంది.
14వ భారత్-జపాన్ శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు శ్రీగంధంతో తీర్చిదిద్దిన అపురూప వస్తువు ‘కృష్ణ పంఖీ’ని బహుకరించారు మోదీ.
శ్రీకృష్ణ లీలల్ని వర్ణిస్తూ రాజస్థాన్లో తీర్చిదిద్దిన కళారూపం అది. ఎంతో నైపుణ్యంతో కూడిన కళ అందులో కనిపిస్తుంది. సంప్రదాయ ఉపకరణాలతో చెక్కిన పంఖీ అది. మన జాతీయ పక్షి నెమలిని పైభాగంలో చూడవచ్చు. ఈ కృష్ణ పంఖిలో కృష్ణప్రతిమ, నెమలితో పాటు …బుషివర్యుడి బోధ వింటున్న శిష్యుడినీ దర్శించవచ్చు.
దాని అంచులలో చిన్న ‘ఘుంగారూ’ (చిన్న సాంప్రదాయ గంట) ఉంది, ఇది గాలి ప్రవాహంతో కదులుతుంది. ఈసొగసైన కళాఖండంలో నాలుగు కిటికీలనూ చూడవచ్చు. గంధపు చెక్కల్ని ఇలా అద్భుతంగా తీర్చిదిద్దే ఘనత రాజస్థాన్ కళాకారుల సొంతం. ఇందులోని సంప్రదాయ జలి డిజైన్ చేతితో చెక్కినదే. భారతదేశంలోని దక్షిణప్రాంత అడవుల్లో పెరిగే చందనంతో దీన్ని తయారు చేస్తారు. ఈ గంధం ఎన్నేళ్లైనా సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.