శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
కొలంబోలోని రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి గోటబయ రాజపక్స యునైటెడ్ నేషనల్ పార్టీ నాయకుడైన విక్రమసింఘేతో ప్రమాణం చేయించారు. నిరసనకారులపై ప్రభుత్వ హింసాత్మక దాడుల నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్సె సోమవారం రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశానికి సుస్థిరతను తీసుకొచ్చే ప్రయత్నంలో విక్రమసింఘే మళ్లీ నియమితులయ్యారు.
అటు నిరసనకారులపై దాడుల తర్వాత బుధవారం రాజధాని వీధుల్లో అధికారులు సాయుధ దళాలను మోహరించారు.అల్లర్లలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
ఆర్ధిక సంక్షోభం కారణంగా రాజపక్సే రాజీనామా చేయాలని కొన్ని వారాలుగా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్రపతి గోటబయ రాజపక్సపై అవిశ్వాస తీర్మానం మే 17న చర్చకు రానుంది. అదే రోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక ఆమోదం పొందిన తర్వాత ఈ తీర్మానాన్ని చర్చకు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఈ సంక్షోభం మొత్తం దేశాన్ని కుదిపేసింది. దీని ద్వారా ఇంధనం, ఆహారం సహా ఇతర నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది.