విదేశీ పాలకులను ఎదిరించి పోరాడిన ధీర వనితగా రాణి అహిల్యాబాయ్ ని చెప్పవచ్చు. సరిగ్గా 300 సంవత్సరాల క్రితం గిరిజన కుటుంబంలో జన్మించి వీరవిద్యలు నేర్చుకున్నారు. తర్వాత మరాఠా రాజకుటుంబం లో కోడలిగా అడుగుపెట్టి విద్యలు గ్రహించారు. భర్త, మామ గారి అకాల మరణంతో పరిపాలన చేపట్టి గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఆమె సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం.
గొప్ప సంస్కరణ వాది
మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, వితంతువులు కు పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాలు పట్ల ఆంక్షలు….ఇలా సాహసోపేత నిర్ణయాలు ఎన్నో చేశారు.
సామాన్య ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ప్రజారంజకంగా పాలించారు. ఆమె కోట తలుపులు సామాన్యులు తమ గోడు చెప్పుకోడానికి ఎప్పుడూ తీసే ఉండేవి.
వీర రాణి
తన రాజ్యం పైకి ఇతరులు దాడికి వస్తె గుర్రం ఎక్కి, ఖడ్గం చేతపట్టి రణ రంగంలో స్వయంగా నేతృత్వం చేపట్టిన ధీర వనిత. వారి మామ గారి వెంట అనేక యుద్ధాలకు వెళ్లి,యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించారు. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరారు.
1783లో జైపురు రాజ కుటుంబానికి చెందిన చంద్రావంత్ ను అణిచి వేయడంలో ఆమె చూపిన యుద్ధ నైపుణ్యంను నానా ఫడ్నవీస్ పొగుడుతూ ఆనాడు పూనాలో గాలిలొ శతఘ్నులను పేల్చాడు.
హిందూధర్మ పునరజ్జీవనానికి కృషి
ప్రజా ధనంతో కాక,తన స్త్రీ ధనంతో విదేశీ (ముస్లిం) పాలకుల వల్ల ధ్వంసం అయిన దేశ వ్యాప్తంగా 82 చోట్ల మందిరాలను తిరిగి నిర్మించారు. సోమనాథ్, రామేశ్వరం, ,కాశీ, గయ, పూరి, ,శ్రీశైలం
…ఇలా అనేక మందిరాలను పునర్నిర్మాణం చేశారు. అన్నదాన సత్రాలను కట్టించారు.
ఉపాధి కల్పనకు కొత్త ప్రయోగాలు
ఉపాధి కల్పన,పశుపాలన, వ్యవసాయం కొరకు నూతన చెరువుల నిర్మాణం,నీటి నిల్వకు ట్యాంక్ లు,నదులపై ఘాట్ లను నిర్మించారు. గ్రామీణ .ప్రజలకు నీటి వసతులు కల్పించారు. వస్త్ర పరిశ్రమ, సిల్క్ పరిశ్రమ, ఉత్పత్తుల అమ్మకాలకు వ్యాపార కేంద్రాల(Market centres) ఏర్పాటు …ఇలా అనేక వ్యాపారాలను ముందు చూపుతో ప్రోత్సహించారు. ఆమె ముఖ్య పట్టణం మహేశ్వరం. మహేశ్వరం చీరలు అంటే ఇప్పటికి మంచి పేరే ఉంది!
గిరిజన తెగలతో స్నేహ హస్తం-వారి అభివృద్ధికి నూతన ప్రయోగాలు
బిల్లులు,గోండులు వంటి గిరిజనులకు భూములను ఇచ్చి వారిని వ్యవసాయం వైపు మళ్లించి వారితో స్నేహం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రజలకు దారి చూపుతూ ఉండే బిల్లులకు ప్రజల నుండి భిల్ కావడి వంటి పన్నును సేకరించుకునేట్లు ప్రోత్సహించారు.
ఆ ఆదాయంతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు,అభివృద్ధి పథకాలు చేపట్టారు. గిరిజన మహిళలు చీరలు నేయడం ప్రోత్సహించి , వారి ఆర్థిక స్వయం ఉపాధికి నూతన బాటలు వేశారు.
పొగడ్తలకు ఆమడ దూరం
ప్రజా పాలన చేస్తున్న రాజ కుటుంబంలో ఉన్నప్పటికీ నిరాడంబర జీవితం గడిపారు.
సాధారణంగా కవులు ..రాజులను పొగిడి ధన సేకరణ చేసుకుంటూ ఉంటారు. కవులు ఆమెను పొగుడుతూ కవిత్వం రాయడాన్ని ఆమె అంగీకరించేది కాదు.” నన్ను పొగుడుతూ కవిత్వం చెబితే మీకు ఆదాయం ఉండదు.ఆ శివుడిని పొగడండి లేదా దేశాన్ని కాపాడుతున్న సైనికులను పొగుడుతూ కవిత్వం రాయండి.మీకు ధనం ఇస్తాను” అనేది.ఇది ఆమె స్వభావం.అనేక అరుదైన ప్రాచీన మత గ్రంథాలను,వ్రాత ప్రతులను సేకరించారు.
15 నూతన చట్టాలు
అహిల్యాబాయ్ పాలనలో 15 నూతన చట్టాలను చేశారు. అడవుల నరికివేతను నిషేధించారు.
ఆదాయం ఇచ్చే చెట్లను నాటించారు. త్రాగుడును నిషేధించారు. వరకట్నాన్ని నిషేధించారు. ఆమె పరిపాలనా వ్యవస్థలో అవినీతికి తావులేదు. న్యాయపాలనకు ఆమె ప్రజా పాలనకు ప్రతీక.
దౌత్య విధానాలకు అప్పట్లోనే శ్రీకారం
తన రాజ్యంలో అన్ని కులాల,
మతాల ప్రజల పట్ల సమ భావంతో వ్యవహరించారు. కనుకనే టి ప్పు సుల్తాన్ వంటి ముస్లిం రాజులు సైతం ఆమె ధార్మిక నిర్మాణాలకు అడ్డు చెప్ప లేకపోయారు.ఆమె సంస్థానంలో దేశంలోని 13 రాజ్యాలకు చెందిన ప్రతినిధులు ఉండేవారు. చుట్టు ప్రక్కల 13 రాజ్యాలలో ఆమె రాజ్యపు ప్రతినిధులు ఉన్నారు.వివిధ రాజులతో మిత్రత్వం నడిపి,నూతన దౌత్య విధానాలకు దారి చూపింది. కనుకనే దేశ వ్యాప్తంగా వివిధ రాజుల రాజ్యాలలో 82 చోట్ల హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేయగలిగింది. శివాజీ గొప్ప యోధుడు,గొప్ప సు పరిపాలకుడు.వారు చిన్న వయస్సులోనే తనువు చాలించారు. శివాజీ పూర్తి చేయలేకపోయిన పనులను ప్రధానంగా విదేశీ పాలకుల వల్ల విద్వంసం అయిన మందిరాల పునర్నిర్మాణ పనులను 82 చోట్ల అహల్యా భాయి చేసారు.
ఆమె స్వయంగా గొప్ప భక్తురాలు.
సమగ్ర పట్టణ అభివృద్ధికి నమూనా మహేశ్వర్
తన ముఖ్య పట్టణంగా ఇండోర్ కు దూరంగా నర్మదా నదీ తీరాన మహేశ్వర్ ను ఒక గ్రామాన్ని ముఖ్య పట్టణంగా నూతనంగా నిర్మించారు. ఆ ముఖ్య పట్టణం సమగ్ర పట్టణాభివృద్ధి యోజనకు ( Model to urban development) మంచి ఉదాహరణ.
ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా,గౌరవంగా పిలిచేవారు.
13 ఆగస్ట్ 1795లో 70 వ ఏట తనువు చాలించింది.ఆమెను ధార్మిక ప్రవృత్తి కల్గిన పరిపాలకురాలిగా గా పాశ్చాత్య చరిత్రకారులు కొనియాడారు.
ఆమె జన్మించి 300 సం.లు అయింది.అయినా ఆమెను భగవద్గీతలో పేర్కొన్నట్లు కర్మ యోగి గా, మాతృత్వంతో నిండిన రాణిగా పేర్కొనడం సముచితం.
వారి 300వ జయంతి ఉత్సవాలను మే 31, 2024 నుండి ఒక సంవత్సరం పాటు దేశమంతటా నిర్వహించు కుందాం! ఆమె జయంతి ఉత్సవాల ద్వారా మన దేశంలోని సాధారణ మహిళలలో దాగి ఉన్న అసాధారణ సామర్ధ్యాలను మన ప్రజానీకానికి, ప్రపంచానికి తెలియ చేద్దాం!చరిత్రకారులు ఆమెకు చరిత్రలో తగు స్థానం కల్పించ లేదు.300వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆమె చేసిన గొప్ప పనులను ప్రజలకు తెలియ చేసి చరిత్రలో ఆమెకు సరి ఆయిన స్థానం మనం కల్పించాలి.ఆమెకు అనేక కలలు,లక్ష్యాలు ఉన్నాయి.
పూర్తికాని ఆ లక్ష్యాలను మనం చేసి చూపడమే ఆమెకు నిజమైన నివాళి!