1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఎందరో హిందువులు అసువులు బాసారు. ఆ సమయంలోనే ఢాకాలోని రామ్నా కాళీ ఆలయాన్ని పాక్ సైన్యం ధ్వంసం చేసింది. అంతేకాదు ఆలయాన్ని రక్షించుకునేందుకు అడ్డువచ్చిన, అందులో తలదాచుకుంటున్న వందలాదిమంది హిందువులను పాక్ సైన్యం హతమార్చింది.
ప్రత్యేక బంగ్లాదేశ్ డిమాండ్ ను అణచివేసేందుకు పాక్ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ లో ఆ కుట్ర ఒకటి. తూర్పు పాకిస్తాన్లో నివసించే వేలాదిమంది హిందువులు, బెంగాలీ ముస్లింలు ప్రత్యేక దేశం కోసం ఉద్యమించారు.
మార్చి 27, 1971న ….600 ఏళ్ల రామ్నాకాళీ ఆలయంలో బుల్లెట్ల వర్షం కురిసింది. ఆలయ ప్రధాన పూజారి శ్రీమఠ్ స్వామి పరమానందగిరిని కూడా పాక్ సైన్యం వదల్లేదు. ఆలయంలో తలదాచుకున్న స్వామి సహా.. వందలాది హిందువులను పాకిస్తాన్ ఆర్మీ హతమార్చింది, వారిలో మహిళలు, చిన్నారులూ ఉన్నారు. ఆలయాన్ని కూల్చేందుకు ఆర్మీ ప్రయత్నిస్తుంటే అడ్డుకున్న 250 మందిని తుపాకులతో కాల్చి చంపారు పాకిస్తాన్ సైనికులు.
కొన్నిరోజులపాటు ఆలయం మంటల్లో కాలింది. శవాలూ రోజుల తరబడి కాలి బూడిదయ్యాయి.
నాటి యుద్ధంలో భారత సైన్యం సాయంతో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమేసింది బంగ్లాసైన్యం. స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరించిన తరువాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆలయస్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత….కొత్త ప్రభుత్వం ఆలయ స్థలాన్ని స్వాధీనంచేసుకుంది. అక్కడి మైనార్టీల విశ్వాసాన్ని గౌరవిస్తూ 600 ఏళ్ల చరిత్రగల ఆలయాన్ని పునర్నిర్మిస్తారనీ అందరూ ఆశించారు. కానీ అలా జరగలేదు. ఆలయ హిందూ బోర్డును, ఆలయ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అనంతరం పీడబ్ల్యూడీకి ఇచ్చారు. తరువాత అక్కడ డాకా క్లబ్ నిర్మించారు.
అయినా అక్కడి హిందువులు ఆశ కోల్పోలేదు… పవిత్రంగా భావించే ఆ నేలలో పూజలు చేసే హక్కు కల్పించాలంటూ కోర్టులు పిటిషన్లు వేస్తూనే వస్తున్నారు. వారి ఎడతెగని ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు 2000 సంవత్సరంలో షేక్ హసీనా ప్రభుత్వం వారి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంది. దీంతో స్థానిక హిందువులంతా అక్కడ మంటపాలు వేసి కాళీ పూజలు మొదలుపెట్టారు. 2004లో అక్కడ అమ్మవారి విగ్రహాన్నీ ప్రతిష్టించారు. తరువాత రెండేళ్లకు అంటే 2006లో ఏర్పడిన ఖలీదా జియా ప్రభుత్వం అక్కడ ఆలయ నిర్మాణానికి అనుమతిచ్చింది. 2017లో నాటి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణం గురించి ప్రభుత్వంతో మాట్లాడారు. అయితే ఆ ప్రాంతం ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ఉందంటూ అక్కడ కాక …ఆ ప్రదేశానికి కాస్త దూరంలో ఆలయాన్ని నిర్మించుకోవచ్చని బంగ్లా సర్కారు సూచించింది.అందుకోసం రెండున్నర ఎకరాలు కూడా కేటాయించింది. కానీ స్థానిక అధికార యంత్రాంగం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. రామ్నా కాళీ ఆలయ నిర్మాణంలో సహకారించేందుకు భారత్ సైతం సిద్ధమైంది. ఆ విషయాన్ని సుష్మాస్వరాజ్ స్వయంగా అక్కడివారికి హామీ ఇచ్చారు. ఇక బంగ్లాదేశ్ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మూడురోజుల పర్యటన కోసం వెళ్లిన కోవిద్ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులు సమీక్షించవచ్చని భావిస్తున్నారు.