యునెస్కో గుర్తించిన రామప్ప ఆలయ ప్రత్యేకతలివే…
తెలంగాణలోని చారిత్రక రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. కాకతీయరాజుల శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన ఆలయం 8 వందల ఏళ్లనాటిది, దీనికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. మరి ఇంతటిగుర్తింపు వెనక ఆసక్తికర పరిణామాలు ఓసారి చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా గట్టి పట్టుబట్టడంతో యునెస్కో రామప్ప గుడిని వరల్డ్ హెరిజేట్ సైట్ గా ప్రకటించిందని తెలిసింది. రామప్ప గుడికి గుర్తింపుపై నార్వే తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ పంపిన ప్రతిపాదనల పట్ల నార్వే అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ భారత్ కు చిరకాల మిత్రదేశం రష్యా మాత్రం రామప్ప గుడికి గుర్తింపు ఇవ్వాలంటూ చివరి వరకు మద్దతుగా నిలిచింది.2019లో రామప్ప గుడి అంశం యునెస్కో వద్దకు చేరింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఎంఓఎస్) సభ్యులు ములుగు జిల్లాలోని పాలంపేటలో కొలువై ఉన్న 13వ శతాబ్దం నాటి రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
రామప్ప గుడి ప్రాశస్త్యాన్ని, నిర్మాణ శైలి, కాకతీయ రాజుల వైభవాన్ని, నాటి పరిస్థితులను యునెస్కోకు వివరించడంలో సఫలమైంది. తద్వారా ఓటింగ్ వరకు ఈ అంశాన్ని తీసుకెళ్లగిలింది. అయితే, ఐసీఎంఓఎస్ సభ్యులు రామప్ప గుడి వద్ద గుర్తించిన లోపాలను ఆధారంగా చేసుకుని నార్వే వ్యతిరేక ఓటు వేయగా, రష్యా తదితర దేశాల బాసటతో భారత్ ప్రతిపాదనలకు విజయం చేకూరింది.
రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్లు, వరంగల్కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలో కొలువై పూజలందుకుంటోంది రుద్రేశ్వరుడే అయినా ఇది మాత్రం నిర్మించిన శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందింది.
రామప్ప ఆలయ శిల్పకళ విశిష్టమైనది. ఈవిశిష్టతే ఇప్పుడు గుర్తింపును తెచ్చింది. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో యునెస్కో చేర్చింది.
కాకతీయులకాలంలో 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. రామప్ప నేతృత్వంలో ఎందరో శిల్పులు దాదాపు 40ఏళ్లపాటు ఈ కట్టడాన్ని చెక్కారని, నిర్మించారని చరిత్రకారుల అంచనా.
కాకతీయ చక్రవర్తి గణపతిదేవ మహారాజు కాలంలో ఆయన ప్రధానసేనాని రేచర్ల రుద్రుడు సూచించడంతో ఏకశిలానగరానికి కాస్త దూరాన ఈ గుడి నిర్మాణం చేపట్టినట్టు శాసనాలు చెబుతున్నాయి.
సాండ్ బాక్స్ టెక్నాలజీ ఈ ఆలయ ప్రత్యేకత. అంటే ఇసుక పునాదిపై దీని నిర్మాణం సాగింది. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. నక్షత్రాకార మండపంపై ఆలయం ఉంటుంది. ఇక దీనికి నీటిమీద తేలియాడే ఇటుకలను వినియోగించారు. ఆ ఇటుకల్ని విమాన గోపురానికి వాడారు. రుద్రేశ్వరఆలయానికి అనుబంధంగా మూడు ఆలయాలుంటాయి. ఒకటి కామేశ్వరాలయం , మరోటి కాటమేశ్వరాలయం. గర్భగుడిలో పెద్ద శివలింగం, ఎదురుగా పెద్దనంది ఉంటాయి. ఎటువైపు వెళ్లినా మనల్నే చూస్తున్నట్టనిపించడం నందిప్రత్యేకత. ఇక సమీపంలోని రామప్ప చెరువు, ఆలయ ప్రాంగణంలో అందమైన ఉద్యానవనాలు ఈ బృహదాలయానికి సరికొత్త వన్నె తెస్తాయి.
ప్రధాన గోపురాలను ఎర్రఇసుక అంటే రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు. వెలుపలివైపు నల్లరాయి వాడారు. ఆరాయి ఎప్పటికీ వన్నె తగ్గని రాయి.
16,17 శతాబ్దాల్లో పలు యుద్ధాలు, దాడులను తట్టుకుని, ఓ భూకంపాన్నీ తట్టుకుని గుడి నిలబడింది. అయితే చుట్టూ ఉన్న కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. తరువాత అనుబంధ ఆలయం అయిన కాటమేశ్వరాలయం కాస్త కుంగింది. ప్రధాన ద్వారం సైతం కాస్త దెబ్బతింది.
గర్భగుడి ముందున్న విశాలమండపంలో అద్భుతమైన శిల్పకళావైభవం దర్శనమిస్తుంది. చుట్టూ 8 మదనికాశిల్పాలు ఆకట్టుకుంటాయి. పురాణగాథలు, శివతాండవం, అష్టలక్ష్ములు, క్షీరసాగరమథన ఘట్టాలు, మురళీకృష్ణుడు, సంగీత వాద్యకారులు, ఏనుగు, గుర్రాలు సహా జంతుజాలాల శిల్పాలు అత్యద్భుతంగా చెక్కారు.
మదనికల్లో హై హీల్స్ వేసుకున్న శిల్పం ప్రత్యేక ఆకర్షణ.
చక్కని చేతతో సూక్ష్మ శిల్పాలు ఔరా అనిపిస్తాయి. అష్టదళ పద్మాకారపు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. అంత సూక్ష్మ శిల్పంలో సూదిమొన నైపుణ్యం ఆశ్చర్యపరుస్తాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపు ఈ గుడి.
ఈ ఆలయంపై ఉన్న శివతాండవ భంగిమలను ఆధారంగానే నటరాజరామకృష్ణ పేరిణీనాట్యకళను పునరుజ్జీవింపచేశారు. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమల్నీ చెక్కారిక్కడ.
ఇన్ని ప్రత్యేకతలున్న రామప్ప ఆలయం భారత ఆర్కియాలజీ సర్వే వారి ఆధీనంలో ఉంది. తెలంగాణ పర్యాటక విభాగం కూడా గుడి నిర్వహణ చూస్తోంది. ఇప్పుడి ఇంతకాలానికి యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.