రామన్నా! ఏం జెప్పినవన్నా!!
ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మేధో శక్తి మోఘంగా కనిపిస్తున్నది. తెలంగాణలోని ప్రతిపక్షా వాళ్లకు ఆ పదవులు తన తండ్రి పెట్టిన భిక్ష అని సెలవిచ్చిండు సీఎం తనయుడు. తెలంగాణ రాష్ట్రమే సోనియమ్మ పెట్టిన భిక్ష అంటారు కాంగ్రెస్ నేతలు. భిక్ష అనవచ్చో లేదోగానీ రాష్ట్ర ఆవిర్భావానికి కారణం మాత్రం సోనియా గాంధీయే. అందులో అనుమానం లేదు. ఆ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి విశ్వాస గుణం ఉండాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ ను విలీనం చేస్తా అని మాట తప్పింది ఎవరో కెటిఆర్ కు తెలియదేమో. తెలంగాణ రెండో దశ ఉద్యమం మొదలైన ఐదారు ఏండ్ల వరకు ఏడ ఉన్నాడో అడ్రస్ లేని మనిషి కెటిఆర్. ఓ పక్క హరీష్ రావు తన మేనమామ కెసిఆర్ కు నీడలా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్నారు. కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ జాగృతి పేరుతో అంతో ఇంతో ఉద్యమంలో కనిపించారు. కానీ కెటిఆర్ ఇప్పుడు ముఖ్యమైన మంత్రి కావడం, కాబోయే ముఖ్యమంత్రి అనే టాక్ రావడమే విడ్డూరం.
కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి రావడానికి కారణం సోనియా గాంధీ. ఎందుకంటే, ఆంధ్రా ప్రాంత ఎంపీలు ఎంత అడ్డంపడినా పార్లమెంటులో బిల్లును పాస్ చేయించారు. సోనియా గాంధీ దృఢ సంకల్పం, కాంగ్రెస్ సర్కారుకు బిజెపి నేతల సహకారం, వంటి కారణాల వల్లే రాష్ట్రం ఏర్పాటైంది. అందుకే కల్వకుంట్ల దొరగారికి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. ఈ సంగతిని కెటిఆర్ చాలా కన్వీనియెంటుగా మర్చిపోయినట్టు నటించారు. రాష్ట్రం ఇచ్చిన వాళ్లను తలచుకోకుండా తెచ్చింది మేమే అని చెప్పుకోవడం కెసిఆర్-కెటిఆర్ లకు అలవాటైంది. నిజమేందో ప్రజలకు తెలుసు. కానీ వాస్తవ విరుద్ధమైన విషయాలను ఇంత బాహాటంగా, ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పే కళలో రామన్న ఇంతలా ఆరితేరడమే గొప్ప విశేషం.