ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు ఢిల్లీలోని పార్టీ మాజీ ప్రత్యేక ప్రతినిధి మాజీ ఐఏఎస్ రామచంద్రు తేజావత్. ఇదొక్కటే కాక తెలంగాణ ప్రభుత్వం తీరు, పార్టీ నిర్ణయాలు నచ్చడం లేదని ఈ సందర్భంగా చంద్రు వ్యాఖ్యానించారు. ఇక తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ముకు మద్దతు ఇవ్వవద్దని నిర్ణయించడం తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన… రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. పార్టీకి, ప్రభుత్వానికి మరెంతో సేవ చేద్దామని అనుకున్నా తనను గుర్తించలేదని వాపోయారు.
రామచంద్రు చాలాకాలం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పి స్ట్రోమ్ వాటర్ ప్రాజెక్ట్ లకు అన్ని క్లియరెన్స్ వచ్చేందుకు తనవంతు కృషి చేశారు. అయితే చంద్రు త్వరలోనే బీజేపీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.