భక్తులకు రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు విజ్ఙప్తి
రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి రోజు నుంచి ఈ అభియాన్ ప్రారంభమైంది. ప్రజల నుంచి రూ.10/-,100/-,1000/- కూపన్ల ద్వారా నిధిని సేకరిస్తున్నారు. అయితే కొందరు భక్తులు మాత్రం ధన రూపేణ కాకుండా.. మందిర నిర్మాణానికి వెండి ఇటుకలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు ఓ విజ్ఙప్తి చేసింది. ఇకపై భక్తులు ఎవ్వరు కూడా వెండి ఇటుకలను పంపిచవద్దని తెలిపింది. ఇప్పటికే 400 కిలోల వెండి ఇటుకలు విరాళంగా వచ్చాయని.. వాటిని భద్రపరచడానికి స్థలం సరిపోవడం లేదని ట్రస్టు తెలిపింది. బ్యాంకు లాకర్లన్నీ ఇప్పటికే నిండిపోయాయని.. దేశ నలుమూల నుంచి వెండి ఇటుకలు వచ్చాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే వచ్చిన వాటిని భద్రపరచడం సవాల్గా మారిందని ట్రస్టు సభ్యులు పేర్కొంటున్నారు. భక్తుల విశ్వాసాలను తాము గౌరవిస్తామని.. అయితే వెండి ఇటుకలను పంపించవద్దన్న విజ్ఙప్తిని అంతా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఒకవేళ ఆలయం కోసం ఇంకా వెండి అవసరమైతే అప్పుడు అడుగుతామని తెలిపారు.
కాగా, ఇప్పటికే రామ మందిర నిర్మాణానికి రూ.1600/- కోట్లు వచ్చాయని ట్రస్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ నిధిని సేకరించేందుకు ఇప్పటికే ఎన్నో గ్రూపులను ఏర్పాటు చేసింది. చెక్కుల రూపంలో, బ్యాంకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ విరాళాలు ఇవ్వాలని ట్రస్టు కోరుతుంది. ఇక కూపన్ల ద్వారా దేశ వ్యాప్తంగా నిధిని సేకరించేందుకు లక్షా యాభై వేల గ్రూపులు పాల్గొంటున్నాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. మందిర నిర్మాణం 39 నెలల్లో పూర్తి అవుతుందని తెలిపారు.