ఆంధ్రాలో హిందువులకు రక్షణ లేదా?
జగన్ రెడ్డి ఏలుబడిలో బలవంతపు మతమార్పిడులు పెచ్చుమీరిపోయాయనే ఆరోపణలు ఏడాదిగా వినవస్తూనే ఉన్నాయి. ఇక హిందూ దేవాలయాలపై దాడులు ఒక ఉద్యమంలా సాగుతున్నాయి. అంతర్వేదిలో రథం దహనం ఘటనపై దోషులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చేసి ఉంటే దుండగులకు భయం ఉండేది. కానీ అలా జరగలేదు. పదుల సంఖ్యలో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతూనే ఉన్నాయి. రామతీర్థంగా శ్రీరాముడి విగ్రహం తలను సుత్తులతో కొట్టి మరీ ధ్వంసం చేసిన దుండగులు ఎవరో తెలియదు. తూర్పు గోదావరి జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదా, లేక రాజీకయ శక్తులు అడ్డు పడుతున్నాయా అనే అనుమానా వ్యక్తమవుతున్నాయి.
తిరుమలలో అన్యమత వివాదాలకు లెక్కే లేదు. హిందూ ఆలయ పరిసరాల్లో ఇష్టారాజ్యం నడుస్తూనే ఉంది. శ్రీశైలంలో అక్రమాలకు లెక్కలేదు. తిరుమలకు వెళ్లిన వైసిపి నేతలు, మంత్రులు అక్కడ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం అనైతికం అనే స్పృహ కూడా లేనట్టుంది. హిందువులు అంటే లెక్కలేని తనం కొందరు వైసిపి నేతల్లో పెరుగుతున్నది. చిలకలూరి పేటలో క్రైస్టవులకు నచ్చని ఒక చర్య జరిగితే హోం మంత్రి ఆగమేఘాల మీద అక్కడి వెళ్లి దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ మతానికి చెందిన వారిని ఊరడించారు. హిందూ దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగినా హోం మంత్రి గానీ ముఖ్యమంత్రి గానీ పరిశీలించిన దాఖలాలు లేవు. ఏపీలో హిందువులకు ఎలాంటి హక్కులు లేవా? వరసగా ఇన్ని దాడులు జరుగుతున్నా దోషులను శిక్షపడేలా చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదా? అనేది ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వానికి మనసు లేకపోవడం వల్లే దుండగుల జాడ తెలియడం లేదేమో అనేది హిందువుల అనుమానం. దీనికి జగన్ రెడ్డి ప్రభుత్వం సరైన విధంగా సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చూడాలి. తగిన శిక్ష పడేలా చేయాలి. ఈ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు.