పాకిస్తాన్ వైఖరి మరోసారి బయటపడింది. అప్పులు చేసి, డబ్బులు తెచ్చుకొని మరీ ..ఉగ్రవాదానికి ఊతం ఇస్తోంది. ఈ విషయాన్ని ఆధారాలతో సహా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బయట పెట్టారు. శత్రుదేశం వైఖరిని ఆయన పూర్తిస్థాయిలో దుమ్మెత్తి పోశారు. పాకిస్థాన్ ఎన్నో ఏండ్లుగా ఉగ్రవాదులను పెంచిపోషిస్తుంటే.. భారత సైన్యం కేవలం 23 నిమిషాల్లోనే వారిని మట్టుపెట్టిందని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వరుసగా వివిధ దళాల సైన్యాలతో మమేకం అవుతున్నారు.
గుజరాత్లోని భుజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దాయాది దేశ చర్యలను భారత్ నిశితంగా గమనిస్తున్నదని పేర్కొన్నారు. తేడా వస్తే ఆ దేశంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాకిస్థాన్ అప్పులు చేసి మరీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆరోపించారు. భారత్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే వాటిని పునః నిర్మించుకోవడానికి పాకిస్థాన్ జైషే మహ్మద్ చీఫ్ మజూర్ అజార్కు రూ. 14 కోట్లు మంజూరు చేసిందని ఆరోపించారు. ఐఎంఎఫ్ నిధులను పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం వెచ్చిస్తున్నదని పేర్కొన్నారు. పాకిస్థాన్కు అప్పులు ఇచ్చే విషయంపై ఐఎంఎఫ్ పునరాలోచించుకోవాలని సూచించారు.
పాకిస్తాన్ చేస్తున్న పాడు పనులకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ బయటపెట్టారు.