గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, విడుదల చేయాలంటూ…ఆయన భార్య ఉషాబాయి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన తరువాత ఆయన… మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలో పాల్గొనవద్దని.. ఎక్కడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టవద్దంది.
హైదరాబాద్లో మునావర్ ఫారుఖీ అనే స్టాండప్ కమెడియన్ షో అనుమతి రద్దు చేయాలని కోరుతూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. అయితే ఓ వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలున్నాయంటూ పలువురు ఆరోపించారు. పలువురి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. తరువాత పీడీ యాక్ట్ పెట్టి మళ్లీ అరెస్ట్ చేసి జైలుకుపంపారు. ఆగస్ట్ 25 నుంచి ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు.
రాజాసింగ్పై వంద కేసులు ఉన్నాయని ఆయన పదేపదే మత విద్వేషాలను రెచ్చగొడ్తున్నారని కోర్టులో పోలీసులు వాదించారు. రాజాసింగ్పై పెట్టిన పీడీ యాక్ట్ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. తనపై పెట్టిన పీడీ యాక్టును ఎత్తేయాలని రాజాసింగ్ కమిటికి విజ్ఞప్తి చేశారు. విచారించిన కమిటీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేయడంతో .. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఆ వ్యాఖ్యలతో బీజేపీ కూడా ఆయన్ని సస్పెండ్ చేసింది.ఎందుకు వేటు వేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జైలు నుంచే రాజాసింగ్ పార్టీకి వివరణ పంపారు. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు పార్టీ జాతీయక్రమశిక్షణాసంఘం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ పార్టీ నుంచి ప్రకటన వచ్చే అవకాశంఉంది.