లౌడ్ స్పీకర్ల వ్యవహారంలో మహా సర్కారు అడుగు వెనక్కి వేసింది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్లకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్స్పీకర్లు పెట్టుకోవాలని హోంమంత్రి దిలీప్ పాటిల్ ఆదేశించారు. అంతకుముందు సీఎం ఉద్దవ్ తో సమావేశమైన ఆయన..అనంతరం డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీ లోపు మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించకపోతే, మసీదుల బయట తాము బిగ్గరగా వినిపించే హనుమాన్ చాలీసాను ముస్లింలు వినాల్సి వస్తుందని పదే పదే హెచ్చరించారు రాజ్ ఠాక్రే. ఇందుకు హిందూ సోదరులందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే లౌడ్స్పీకర్ల ద్వారా అజాన్కు పిలుపు ఇవ్వడం మతపరమైన అంశం కాదని, అది సామాజిక సమస్య అనీ అన్నారు. రాజ్యాంగం కన్నా, న్యాయవ్యవస్థ కన్నా తమ మతమే గొప్పదని ముస్లింలు బావిస్తే దెబ్బకు దెబ్బతీస్తామని అన్నారు. అదే సమయంలో ముస్లింలకు, వారి ప్రార్థనలకు తాము వ్యతిరేకం కాదని, శాంతినే తాము కోరుకుంటున్నామనీ చెప్పారు.