మసీదుల ముందు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పెడతామన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 2న గుడిపడ్వా సందర్భంగా ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మసీదుల ముందు రెట్టింపు లౌడ్ స్పీకర్లను పెట్టి హనుమాన్ చాలీసా ప్లే చేస్తామన్నారు. ముంబై మురికివాడల్లోని మసీదులు, మదర్సాలను పోలీసులు సరిగ్గా తనిఖీ చేస్తే ఎన్నో బయటకొస్తాయన్నారు.
ముంబై సహా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోందన్నారు. తమ తమ ప్రార్థనలు జరుపుకొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కానీ పక్క వారికి ఇబ్బంది పెట్టకూడదని అన్నారు ఠాక్రే. లౌడ్ స్పీకర్లు పేరిట పక్క వారిని ఇబ్బంది పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే, ఆ మసీదుల ముందు అంతకు రెట్టింపు సౌండ్ స్పీకర్లు పెడతామన్నారు.“ఏ మతగ్రంథాల్లో కూడా లౌడ్ స్పీకర్ పెట్టమనిలేదని అన్నారు.
ఈ వ్యాఖ్య తరువాత ముంబైలో ఘాట్కోపర్లోని తన కార్యాలయంలో అధిక డెసిబుల్స్లో ‘హనుమాన్ చాలీసా’ను ప్లే చేసింది మహారాష్ట్ర నవనిర్మాణ సేన.