శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలుపుతూ బీజేపీ నేత, మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేఖ రాశారు. దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీకి ప్రాధాన్యతను ఇచ్చి పార్టీని నిలబెట్టారని రాజ్ థాకరే ప్రశంసించారు. లేఖను రాజ్ ఠాక్రే తన ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు.
https://twitter.com/RajThackeray/status/1542814470741069824?s=20&t=LFh418vzjFiNKxLXJ8Qm4g
“మొదట, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు. మీరు మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు కానీ అది కుదరలేదు… మీరు గతంలో వరుసగా ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీరు ఎంతో కష్టపడినా.. పార్టీని దృష్టిలో పెట్టుకుని మీ ప్రయోజనాలను పక్కనబెట్టి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఒక వ్యక్తి ఆకాంక్షల కంటే పార్టీ గొప్పదని మీరు మీ చర్యల ద్వారా చూపించారు. పార్టీ పట్ల నిబద్ధత మీ చర్యల సారాంశం. దేశంలోని, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మీకు నిజంగా అభినందనలు. అయితే, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా లక్ష్యాన్ని చేధించాలనుకుంటే, విల్లు తాడును వెనుకకు లాగాలి. కానీ ఎవరూ దానిని వెనుకడుగు అని అనుకోకూడదు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం మీ కోసం ఎదురుచూస్తోంది. ఒక్కటి మాత్రం నిజం, మీరు మహారాష్ట్ర ముందు మీ సత్తా నిరూపించుకున్నారు. దేశాభివృద్ధికి మరింత కష్టపడే అవకాశం మీకు లభించాలని జగదాంబ దేవిని ప్రార్థిస్తున్నాను. మరోసారి అభినందనలు” అని లేఖలో రాశారు.
ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.