ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ప్రపంచ దేశాలు రెండు వైపులా మోహరించిన సమయాన.. షాకింగ్ న్యూస్ బయటపడింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటుగా కొందరు మంత్రులు ఉన్నతాధికారులు చనిపోయారు అయితే ఈ చనిపోయిన వారిలో ఎక్కువమంది ఇజ్రాయిల్ తో యుద్ధానికి సంబంధించిన నేతలే కావడం కనకలం రేపుతోంది.
రైసీ దుర్మరణం లో పాశ్చాత్య దేశాల పాత్ర ఉందన్న అనుమానం బలపడింది. ఇజ్రాయిల్ కు మద్దతిస్తున్న దేశాల నుంచి రైసీ ముప్పు పొంచి ఉంది. అధునాతన టెక్నాలజీని వాడటంలో ఇజ్రాయిల్ దాని మిత్ర దేశాలు తిరుగులేనివి. అందుచేత ఇటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి.
వాస్తవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కి దేశవ్యాప్తంగా అద్భుతమైన పట్టు ఏమాత్రం లేదు. కరుడుగట్టిన ఛాందస వాది గా ఆయనకు పేరు ఉన్నది. మానవ హక్కుల కోసం ఆందోళన చేసిన వారి మీద కఠినంగా అణిచివేసారని చెబుతారు. ఏకంగా 5 వేల మందికి మరణశిక్ష విధింపుకు కారణమైన వారిలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒకరు. అందుకే 2021లో ఇబ్రహీం రైసీ ఇరాన్ పగ్గాలు అందుకోగానే మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు.
నిజానికి రైసీ రాజకీయ ప్రస్థానం చాలా వివాదాలతో కూడుకున్నది. 2022 సెప్టెంబర్ లో 22 ఏళ్ల ఇరానియన్ కుర్దిష్ మహిళ మహ్సా అమిని అనుమానాస్పద రీతిలో మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. హిజాబ్ ధరించని కారణం గా అమినిని ఇరాన్ మొరాలిటి పోలీసులు అరెస్ట్ చేయడం.. 3 రోజుల నిర్భందం తర్వాత ఆస్పత్రిలో ఆమె చనిపోవడం ప్రకంపనలు రేపింది. ఇరాన్ మహిళా లోకం ఒక్కసారిగా నాటి ప్రభుత్వంపై దండయాత్ర చేసింది. వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపింది. ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీకి వ్యతిరేకంగా నాడు అక్కడి మహిళలు కదంతొక్కిన తీరు ఇరాన్ ప్రభుత్వంలో భూకంపానికి కారణమైంది. అయితే అణిచివేతే ఆయుధంగా ఇబ్రహీం రైసీ ప్రభుత్వం మహిళలపై కాల్పులకు, దాడులకు పాల్పడింది. నెలల తరబడి జరిగిన ఈ భద్రతా అణిచివేతలో 500 మందికి పైగా మరణించారు. దాదాపు 22,000 మందికి పైగా నిర్బంధించబడ్డారు. అప్పుడే రైసీ ఎంతటి దుర్మార్గుడో ప్రపంచానికి తెలిసింది.
నిజానికి రైసీ న్యాయ న్యాయశాఖ మార్గం ద్వారా ఎదుగుతూ వచ్చారు. జీవితంలో ఎక్కువ భాగం ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 2019లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ రైసీని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత 1988లో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీసిన ఘటనలో రైసీ పాత్ర కారణంగా ఈ నియామకాన్ని మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాయి. అంతర్జాతీయ హక్కుల సంఘాల ప్రకారం దాదాపు 5,000 మందికి మరణశిక్ష విధించిన నాటి ఇరాన్ నలుగురి జడ్జిల్లో రైసీ ఒకరు. ఇరాన్తో వైరాన్ని కొనసాగిస్తున్న అమెరికా సైతం ఈ 1988 ఉరిశిక్షలలో రైసీ ప్రమేయాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంటుంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 1980వ దశకంలో ఇరాక్పై యుద్ధం తర్వాత పలు డెత్ కమిటీలను ఇరాన్ ఏర్పాటు చేసుకుంది. ఈ ప్యానల్లో తమ మతాన్ని ఎక్కువగా విశ్వసించే జడ్జిలను పెట్టుకుంది.. ఇందులో రైసీ ఒకరు.
దేశాన్ని ఛాందసవాదం వైపు నడపాలన్నదే రైసీ లక్ష్యం. అందుచేతనే రాజకీయాల వైపుకు మళ్లారు.
ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపిన ఇబ్రహీం రైసీ.. మితవాద మతగురువు హసన్ రౌహానీకి వ్యతిరేకంగా 2017లో అధ్యక్ష పదవికి పోటి చేసి ఓడిపోయారు. 2021లో రైసీ మరోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా ఆవిర్భవించిన తర్వాత అత్యంత వివాదాన్ని రేపిన ఎన్నికలు ఇవే. ఎందుకంటే రైసీకి పోటీనే లేదు. దీంతో దాదాపు 62శాతం ఓట్లు సాధించిన రైసీ అధ్యక్షుడు అయ్యాడు.
ఆ తర్వాత కాలంలో కూడా రైసీ తన చాందస వాదాన్ని కొనసాగించారు. మధ్యకాలం నాటి కఠినమైన నియమాల్ని అమలు చేశారు మహిళలను తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇరాన్ లో నియంత పాలన కొనసాగుతోంది అనవచ్చు. అదే సమయంలో ఇజ్రాయిల్ తో అంతకంతకు శత్రుత్వం పెరగడంతో యుద్ధానికి దారి తీసింది. చాందస ముస్లిం దేశాలు ఇరాన్ కు మద్దతు ఇస్తుంటే పాశ్చాత్య దేశాలు ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తున్నాయి ఈ సమయంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణించడంతో అల్లకల్లోలం చెలరేగుతోంది.