ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.భాగ్యనగరంలో కూడా ఉదయం నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెగక కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. బేగంపేట, చిలకలగూడ, ప్యాట్ని, అల్వాల్, బోయిన్ పల్లి, మారేడ్ పల్లిలో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చాలాచోట్ల వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. కోటి, బేగంబజార్, ఆబిడ్స్, లక్డీకాపూల్లో రోడ్లపైకి నీరుచేరడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. మరో రెండు రోజులపాటు తెలంగాణకు వర్షసూచన ఉందన్న వాతావరణ శాఖహెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్నిచోట్ల రోడ్లపై భారీగా చేరిన నీటిని జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది తోడేస్తున్నారు. కార్యాలయాలు,స్కూళ్లు, కాలేజీలు అయిపోయాక అందరూ ఒకేసారి రాకుండా కాస్త వేచి చూసి వెళ్లాలని ట్రాఫిక్ అదనపు సీపీ రంగనాథ్ సూచించారు.