రైల్వే స్టేషన్లో పోర్టర్స్ రెస్ట్ రూమ్ ను ఏకంగా మసీదుగా మార్చేశారు. రోజూ అందులో నమాజు చేస్తుంటే అడిగేవాళ్లు లేరు. బెంగళూరులోని క్రాంతివీర్ సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఐదో నెంబర్ ప్లాట్ ఫాం దగ్గర కొందరు ముస్లింలు ఏర్పాటు చేసుకున్న అనధికార ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ ఇంతకాలానికి కొందరు హిందువులు నిరసన వ్యక్తం చేయడంతో విషయం బయటకు వచ్చింది.
అసలు రైల్వేస్టేషన్లోని ప్రభుత్వ ఆస్తుల్ని మసీదుగా మార్చడమేంటంటూ నగరంలో హిందూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లోని ప్లాట్ ఫాం నెంబర్ 5 లోని పోర్టర్స్ రెస్ట్ రూంను చట్టవిరుద్ధంగా మసీదుగా మార్చారంటూ కొన్నిరోజుల క్రితం ఓ వీడియో వైరల్ అయింది. ప్రజల ఆస్తులను ఆక్రమించిన మసీదుగా మార్చడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేశారు. ఇది నిజమే అయితే చర్యలేంటని మరికొందరూ నిలదీశారు.
అసలైతే అన్ని వర్గాల కూలీల కోసం విశ్రాంతి గదిగా దీన్ని నిర్మించారు. అయితే పదేళ్ల క్రితమే దాన్ని మసీదుగా మార్చినట్టు తెలిసింది. ఇతరులెవరూ ఆ గదిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. ఈ మసీదును మస్జిద్ ఎ నూరానీగా పిలుస్తున్నారు. ఎలా వచ్చాయో కానీ దానికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హిందూ జనజాగృతి వేదిక సహా పలు హిందూ సంస్థల కార్యకర్తలూ ఆందోళనకు దిగారు. రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదంటూ… పెద్ద ఎత్తున అక్రమ మసీదులోకి చొచ్చుకెళ్లారు. దాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు. అసలు రైల్వే స్టేషన్లో మసీదు ఏంటని నిలదీస్తే అధికారులనుంచీ నోటమాట రాలేదు. అక్కడే ఉన్న సామాన్య ప్రయాణీకులు ఆ మసీదును చూసి అవాక్కయ్యారు.
అనధికారిక ప్రార్థనా స్థలాన్ని తొలగించాలంటూ సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులకు లేఖ రాశారు హిందూ జనజాగృతి వేదిక సభ్యులు. క్రాంతి వీరుడు సంగొల్లి రాయన్న రైల్వేస్టేషన్ గదిని ప్రార్థనా స్థలంగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లేఖలో. అశలు జాతీయభద్రతా కోణంలో ఈ విషయాన్ని చూడాలని…చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నారు. బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. స్టేషన్ చుట్టూ అనేక మసీదులు ఉన్నప్పటికీ ప్లాట్ ఫాంపై ప్రార్థనల కోసం మసీదు ఏర్పాటు చేయడం కుట్రగా అనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
కుట్ర ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రార్థనా స్థలంగా మార్చారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిందని గుర్తు చేస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అధికారులు 2018లో బెంగుళూరు కంటోన్మెంట్ స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్కు చెందిన ఆదిల్ అసదుల్లాను అరెస్టు చేశారు. 2019లో మెజెస్టిక్ ప్రాంతంలో మహమ్మద్ అక్రమ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. బెంగళూరులోని కాటన్పేట్ మసీదులో దాక్కున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ సభ్యుడు బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు” అని స్థానికులు గుర్తు చేస్తున్నారు.
అనధికార ప్రార్థనా స్థలానికి అనుమతించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ జన జాగృతి వేదిక రైల్వే అధికారులను లేఖ ద్వారా డిమాండ్ చేసింది. మరి రైల్వే అధికారులు ఈ అనధికార మసీదుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.