కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ నడిచేది గాంధేయ మార్గం కాదని.. ఆయన నడవడిక పూర్తిగా జిన్నా మార్గంలో ఉంటుందని ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. సోమవారం నహర్కాటియాలో జరిగిన ప్రచార సభలో శివరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాహుల్కు పేరులోనే గాంధీ ఉందని.. కానీ ఆయన మార్గం మాత్రం గాంధేయ మార్గం కాదని అన్నారు. రాహుల్ జిన్నా మార్గంలో నడుస్తారని.. జిన్నా మార్గాన్ని భారతీయులు కానీ.. అస్సామీలు కానీ ఎప్పటికీ అంగీకరించరన్నారు. తమ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మహాత్ముడి మార్గంలో నడుస్తుందని.. మహాత్ముడి ఆలోచనలు కన్పించేలా పాలన సాగిస్తున్నామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ మహాత్ముడి పేరు చెబుతుంటుంది కానీ.. ఆచరణలో మాత్రం ఉండదన్నారు.