రాహుల్ “ట్రాక్టర్పై యాక్టర్”గా ప్రయత్నిస్తున్నాడట..! బీజేపీ చివాట్లు.
కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం హీటెక్కింది. అధికార సీపీఎం, కాంగ్రెస్,బీజేపీల మధ్య గట్టిపోటీ ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళలో రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన నియోజకవర్గం వయనాడ్లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ చేపట్టారు. ఈ సంఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక్కోచోట ఒక్కో తీరుగా ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు.. ఈ బాటలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయంటూ కమ్యూనిస్టు పార్టీలకు చురకలంటించారు. ఈ పార్టీలు రెండు నాల్కల ధోరణితోనే వ్యవహరిస్తుంటాయన్నారు. దేశంలో ఒక్క బీజేపీ మాత్రమే ఏ ప్రాంతంలోనైనా ఒకే నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పార్టీలు కేరళలో ఫైట్ చేస్తాయని.. అయితే ఇవే రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ చేస్తాయన్నారు. మళ్లీ బెంగాల్లో కుస్తీ చేపడతాయన్నారు. ఇదేం విచిత్రమని.. అసలు ఈ పార్టీల ఎజెండా ఏంటో అర్ధం కాదన్నారు. లెఫ్ట్ పార్టీలు బెంగాల్,బీహార్లో కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్ షిప్ చేస్తాయని.. కానీ కేరళలో మాత్రం ఫైట్ చేస్తాయన్నారు.