కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లి కాలేదని వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన కేవలం మహిళా కాలేజీలకు మాత్రమే ఎందుకు వెళ్తారంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. విద్యార్ధినిలు ఆయనతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయన ఏ కాలేజీకి వెళ్లినా.. విద్యార్ధినులను బెండ్ కమ్మని చెబుతారని.. దయచేసి ఎవరూ అలా చేయవద్దని.. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఎంఎం మణి అనే అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇదే ఇడుక్కి ప్రాంతం నుంచి గతంలో ఎల్డీఎఫ్ సపోర్ట్తో జాయిస్ జార్జ్ ఎంపీగా గెలిచారు. అయితే ఇటీవలే కొచ్చిలో సెయింట్ థెరెసా కళాశాల విద్యార్థినులకు.. రాహుల్ గాంధీ ఐకిడో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మాజీ ఎంపీ జాయిస్ జార్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎంపీపై కేసు నమోదు చేయాలి
కాగా, రాహుల్ గాంధీ ఐకిడోలో నిపుణుడని.. తమను తాము ఎలా రక్షించుకోవచ్చో చెబుతూ అక్కడి విద్యార్ధినులకు ట్రైనింగ్ ఇచ్చారని.. దీనిపై మాజీ ఎంపీ జాయిస్ వ్యాఖ్యలు సరైనవి కావంటూ కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మాజీ ఎంపీ రాహుల్తోపాటు యావత్ మహిళలను కూడా అవమానించారని.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.