రాహుల్ గాంధీ ఖాతాను పునరుద్ధరించింది ట్విట్టర్. ఆ పార్టీ నేతల ట్విటర్ ఖాతాలను అన్లాక్ చేసింది. లైంగికదాడికి గురైన దళితబాలికను పరామర్శించిన ఫొటోలను షేర్ చేసినందుకు ఆయన ఖాతాను, ఆ ఫొటోను షేర్ చేసిన మరో 5 వేల మంది ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. తమ ఫొటో వినియోగంపై ఎలాంటి అభ్యంతరం లేదని బాధితురాలి తల్లిదండ్రులు తెలపడంతో ట్విట్టర్ తిరిగి అన్ని ఖాతాలను పునరుద్ధరించింది.
బాలిక తల్లిదండ్రులతో తాను మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్న ఫొటోను ఆగస్టు 4న రాహుల్ ట్వీట్ చేశారు. అయితే లైంగిక దాడి బాధితురాలి ఫొటో బయటపెట్టడం చట్టవిరుద్ధమని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విట్టర్ చర్యలు తీసుకుంది.
అన్లాక్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన ట్విటర్ ఖాతాలో, ‘‘సత్యమేవ జయతే’’ అని ట్వీట్ చేశారు.అటు
అభ్యంతరం వ్యక్తమైన ఫొటోను ఉపయోగించడానికి రాహుల్ గాంధీకి సంబంధిత వ్యక్తులు సమ్మతి తెలియజేస్తూ అధికారికంగా ఇచ్చిన లేఖ కాపీని అందజేశారని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
… అప్పీలు ప్రక్రియలో భాగంగా ఇండియా గ్రీవియెన్స్ సెల్ ద్వారా దీనిని అందజేశారని తెలిపారు. ఆ ఫొటోలోని వ్యక్తులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేయడంతో తిరిగి ఖాతాను పునరుద్ధరించినట్టు చెప్పారు.
అటు తన ఖాతాను బ్లాక్ చేయడంపై స్పందించిన రాహుల్… ప్రభుత్వం చెప్పిన మాటలను ట్విట్టర్ వింటోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ ఖాతాలపై ఆంక్షలు విధించడమంటే దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడమేనన్నారు