కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటలీ వెళ్లినట్టు సమాచారం. ఆయన భారత్ లో లేనందున పంజాబ్ ర్యాలీని పార్టీ వాయిదా వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలు, ర్యాలీలతో దూసుకెళ్తున్న సమయంలో రాహుల్ ఇటవీ పర్యటన చర్చనీయాంశమైంది.
బీజేపీ, దాని మీడియా అనవసరంగా పుకార్లు వ్యాప్తి చేయవద్దని…కొన్నిరోజులు ఆయన వ్యక్తిగత పర్యటనకు వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జనవరి 3 తేదీ మోగా జిల్లా ర్యాలీతో ఆయన పంజాబ్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సి ఉంది. కానీ ర్యాలీ వాయిదా పడొచ్చని చెబుతున్నారు. అయితే రాహుల్ భారత్ వచ్చాకనే పంజాబ్ కాంగ్రెస్ ప్రచారపర్వాన్ని ప్రారంభిస్తుందని తెలుస్తోంది.
మొన్న దీపావళికి ముందు కూడా దాదాపు నెలరోజులు ట్రిప్ లోనే ఉన్నారు రాహుల్. ఆయన నెల రోజుల పాటు లాంగ్ వెకేషన్ లో లండన్ వెళ్లినట్టు వార్తలొచ్చాయి. నెలరోజుల తరువాత పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆయన తిరిగి భారత్ వచ్చారు. రాహుల్ గాంధీ రాజకీయనాయకుడిగా కంటే… యాత్రికుడిగానే కనిపిస్తారని ప్రత్యర్థులు తరచూ ట్రోల్ చేస్తుంటారు. 136వ వ్యవస్థాపక దినోత్సవం రోజున ఆయన ఇటలీ బయల్దేరినట్టు చెబుతున్నారు. ఇక అంతకుముందు 2019 అక్టోబర్లోనూ హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు బ్యాంకాక్ వెళ్లారు రాహుల్. ఈ మధ్య పార్టీ ముఖ్య కార్యక్రమాలకు కూడా రాహుల్ గాంధీ దూరంగా ఉంటూ వస్తున్నారనే ఆరోపణలు పార్టీనుంచే వచ్చాయి. 2019 నవంబర్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తే రాహుల్ వాటినీ దాటవేశారు.
2019 మేలో లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు….యూపీఏ చైర్ పర్సన్ సోనియా నిర్వహించిన ముఖ్య సమావేశానికీ రాహుల్ గైర్హాజరయ్యారు. ఆ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనుకున్నారు. కానీ సడన్ గా సెలవులంటూ లండన్ వెళ్లారు రాహుల్. 2018లో బడ్జెట్ సెషన్ లో పాల్గొనకపోవడం, 2015 నుంచీ థాయ్లాండ్, కంబోడియా, మయన్మార్ , వియత్నాం పర్యటనల కోసం వెళ్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకన్నా వ్యక్తిగత పర్యటనల ప్రయాణాలకే రాహుల్ ఆసక్తి చూపారని పార్టీ వాళ్లే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనల కోసం SPG సెక్యూరిటినీ దాటేసిన ఘటనలూ ఉన్నాయి. చివరకు హోంమంత్రిత్వ శాఖ రాహుల్ సెక్యూరిటీని రద్దు చేసేవరకూ వెళ్లింది పరిస్థితి.
ఇలా తరచూ విదేశీ పర్యటనలు చేసే రాహుల్ ఆ వివరాల్ని ఎప్పుడూ బహిర్గతం చేయరు. అన్నీ రహస్యంగానే సాగిపోతుంటాయి. ఆ విశేషాల్ని సోషల్మీడియాలో కూడా షేర్ చేయరు. పార్టీ ప్రధాని అభ్యర్థి అని చెప్పే నాయకుడు ఇలా అకస్మాత్తుగా మాయమవడం, ఎవరికీ తెలియకుండా ప్రత్యక్షమవడం ఏంటో అని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తుంటాయి.