గురువారం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో బలైన కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యకు ఉగ్రవాదులతో కలిసి కార్యాలయ సిబ్బందే కుట్రపన్ని ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. బుద్గాం కార్యాలయంలో తనకు భద్రత లేదని, జిల్లా ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని తన భర్త పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టుగుర్తుచేశారు మీనాక్షి.
తన భర్త గురించి అడిగినప్పుడు అవతల వాళ్లు చెప్పి ఉండకపోతే ఉగ్రవాదులకు రాహుల్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు అతన్ని బదిలీ చేయలేదని ఆమె వాపోయారు. ఘటనపై దర్యాప్తునకు రాహుల్ భట్ తండ్రి డిమాండ్ చేశారు.
అటు రాహుల్ హత్యను నిరసిస్తూ కశ్మీర్ పండిట్లు ఆందోళనకు దిగారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు..