తెలంగాణ కు మొదట నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం చాలా అండగా నిలుస్తోంది. పారిశ్రామికంగా ఎదిగేందుకు అవకాశాలు ఉన్న ప్రాంతం కావటంతో హైదరాబాద్ కు అనేక అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా రఫేల్ యుద్ధ విమానాల విడి పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్ కు కేటాయించారు. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రాన్స్ కు బయట ఇటువంటి విడి భాగాల తయారీ యూనిట్ పెట్టడం ఇదే ప్రథమం అనుకోవాలి.
హైదరాబాద్ లో మొదట నుంచి డిఫెన్స్ పరికరాలను పెద్ద ఎత్తున తయారు చేస్తూ వస్తున్నారు.తాజాగా రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీకి రంగం సిద్ధం అయింది. రఫేల్ విమానాలకు అవసరం అయిన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తారన్న మాట. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇందుకోసం ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇకపై రఫేల్ యుద్ధవిమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని టీఏఎస్ఎల్ లో తయారవుతాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు ఫ్రాన్స్ వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావటంలో రఫేల్ యుద్ద విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఈ యుద్ధ విమానాలు.. భారత రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా మారాయి. పాకిస్థాన్ సైన్యానికి ఈ యుద్ధ విమానాలు చుక్కలు చూపించాయి అనటంలో సందేహం లేదు. దీంతో రాబోయే కాలంలో మరింత గా ఈ యుధ్ద విమానాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దిశగా హైదరాబాద్ లో రఫేల్ యుద్ద విమానాల విడి భాగాల తయారీకి శ్రీకారం చుట్టారు. యుద్ధ విమానాల తయారీలో మరింత వేగం పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను సంస్థ వేగవంతం చేయనుంది. నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను అందించనుంది. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెట్ సీఎండీ సుకరన్ సింగ్ తెలిపారు.
మొత్తం మీద హైదరాబాద్ కేంద్రంగా యుద్ధ విమానాల విడి భాగాల తయారీ ఊపందుకొన్నట్లయితే దేశ రక్షణ వ్యవస్థ కు ఎంతో ఉపయోగం కలుగుతుందని భావిస్తున్నారు. మరో వైపు , ఆర్థిక పరంగా హైదరబాద్ కు కూడా ప్రయోజనం కలుగుతుందని ఆశించవచ్చు.