నటిగా గుర్తింపు పొంది రాజకీయాల్లోనూ రాణిస్తున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రచయిత్రి కూడా అయ్యారు. ‘లాల్ సలామ్’ పేరుతో ఓ నవల రాశారు. ఏప్రిల్ 2010లో దంతేవాడలో జరిగిన 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోత ఇతివృత్తంగా ఆమె ఈ పుస్తకాన్ని రచించారు. దేశానికి సేవచేస్తూ.. ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు ఈ పుస్తకం ద్వారా నివాళులర్పించనున్నారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన విక్రమ్ ప్రతాప్ సింగ్ అనే ఒక యువ అధికారి కథే లాల్ సలామ్ కథ. ఈ పుస్తకం కవర్ పేజీకి మోషన్ పిక్చర్ను స్మృతి ఇరానీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘కొన్ని సంవత్సరాలుగా ఈ కథ నా మనసులో మెదులుతూనే ఉంది. దానిని కాగితంపై పెట్టాలనే కోరికను నేను ఈ క్షణం వరకు మరచిపోలేదు. పాఠకులు ఈ కథను చదివి ఆనందిస్తారని నేను ఆశిస్తూ.. మీకు నచ్చేలా రాయడానికి ప్రయత్నించాను. ఇది దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీసుకున్నాను’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ వెస్ట్ల్యాండ్ ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పుస్తకాన్ని అమెజాన్ లో విడుదల చేయనున్నట్లు వెస్ట్ల్యాండ్ పబ్లిషర్ వీకే కార్తీక తెలిపారు. ఇప్పటికే ప్రీఆర్డర్స్ మొదలయ్యాయి కూడా. నవంబర్ 29 నుంచి ఈ పుస్తకం అందుబాటులోకి రానుంది.