పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ జెండర్ జోగమ్మ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెళ్లి పురస్కారం అందుకున్న తులసీ గౌడ భారతీయులందరి దృష్టినీ అకర్షించారు.
చీర చెంగుతో కోవింద్ కు మంజమ్మ దిష్టి తీసిన వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మారుమూల గ్రామం నుంచి రాష్ట్రపతిభవన్ వరకు సాగిన ఆమె ప్రయాణం వెనక ఎంతో కృషి ఉంది..అంతకుమించి ఎన్నో అవమానాలు, అంతులేని దు:ఖం ఉన్నాయి.
బళ్లారి జిల్లాలోని కల్లుకంబ గ్రామానికి చెందిన మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. కానీ యుక్తవయసు రాగానే తనలో స్త్రీ లక్షణాలను బయటపడ్డాయి. దీంతో మంజమ్మగా మారింది. తల్లిదండ్రులు మంజమ్మను హాస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకెళ్లి జోగప్పగా మార్చారు. అప్పటినుంచి ఆలయంలో కళారూపాలు ప్రదర్శించడం నేర్చుకుంది. జోగతి నృత్యం చేసేది. దేవుళ్లను కొలుస్తూ పాటలూ పాడేది. జానపద నృత్యకారిణిగా తన వృత్తిని ప్రారంభించిన మంజమ్మ.. జోగిని కాళవ్వ మరణానంతరం జోగటి బృందం బాధ్యతలు స్వీకరించింది . కర్నాటక వ్యాప్తంగా ఎన్నోప్రదర్శనలూ ఇచ్చారు. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గానిలిచారు మంజమ్మ.
ఇక పద్మ అవార్డుల ప్రదానం సందర్భంగా అందర్నీఆకట్టుకున్న మరో మహిళామూర్తి తులసీ గౌడ. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా సాదాసీదాగా వచ్చి అవార్డు స్వీకరించారామె. కర్నాటకకే చెందిన తులసీ గౌడ…40 వేల వృక్షాలతో వన సామ్రాజ్యాన్నే నిర్మించుకుంది. అంకోలా తాలుకా హొన్నాలికి చెందిన తులసికి ఆరేళ్ల వయసప్పుడే తండ్రి చనిపోయాడు. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని సాకే తల్లి… పదేళ్ల వయసులోనే పెళ్లి చేసింది. అయితే కొన్నాళ్లకే భక్త గోవింద గౌడ కూడా చనిపోయాడు. తన విధిరాతను తలుచుకుంటూ దగ్గర్లోని అడవికి వెళ్లి చెట్లూచేమలతో తన బాధను చెప్పుకునేది. అలా అటవీ, చెట్లు ఆమెకు దగ్గరయ్యాయి. పవిత్రమైన మొక్కపేరునే తన పేరుగాగల తులసికి మొక్కలంటే ప్రాణం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షిస్తుండడం చూసి అటవీఅధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించారు. ఆమె అంకితభావం చూసి పర్మినెంట్ చేశారు. అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందినా మొక్కల సంరక్షణ ఆపలేదు. అరవై ఏళ్లల్లో నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించింది. ప్రతీ మొక్కగురించి తులసికి తెలుసు. ఏమొక్క ఎప్పుడు నాటాలి. ఏ నేలలో ఏ మొక్క బాగా ఎదుగుతుంది. ఎన్ని నీళ్లుపోయాలి. ఆ మొక్క ఎన్నేళ్లు బతుకుతున్నాయి. ఏ మొక్క ఏ భాగంలో ఎలాంటి ఔషధ గుణాలున్నాయి వంటివి ఆమెనోటంట వింటే శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతారు. పర్యావరణవేత్తలు ఆమెను ‘ఎన్సైక్లోపిడియా ఆఫ్ ఫారెస్ట్’ అంటే.. ఊరివాళ్లు వనదేవత అని అంటారు.ఆమెను చూసేందుకు, ఆమె ద్వారా అరుదైన వృక్షజాతుల గురించి తెలుసుకుని ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు.76 ఈ వయసులోనూ ఎప్పుడు చూసినా మొక్కలు నాటుతూనే వాటికి నీరు పోస్తూనే ఉత్సాహంగా కనిపిస్తారు.అందుకు తనపెన్షన్ డబ్బును ఖర్చు చేస్తున్నారు.