ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో రాజధాని డెహ్రాడూన్ లో ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ధామీతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 47 స్థానాల్లో విజయం సాధించింది. అయితే పార్టీని మరోసారి విజయ తీరాలకు చేర్చిన ధామీ మాత్రం ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీసిన ఆయన… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భువన్ చంద్ర కప్రి చేతిలో 6579 ఓట్లతో ఓడారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఓడిపోయినా సరే ధామివైపే మొగ్గుచూపింది పార్టీ అధిష్టానం. దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరునెలల్లో ఆయన అసెంబ్లీకి ఎన్నికకావల్సి ఉంది. ఉత్తరాఖండ్ లో మండలి లేదు. అందువల్ల ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలిచి గెలవాల్సిందే. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించిన 21 ఏళ్లల్లో ఏ పార్టీ వరుసగా అక్కడ అధికారంలోకి రాలేదు. మొదటిసారి బీజేపీ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)