గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట దగ్గర జరిగిన ఆందోళనల కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్దూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుడ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన సందర్భంగా హింసను ప్రేరేపించారన్న ఆరోపణలతో పోలీసులు సిద్దూపై కేసుపెట్టి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న సిద్దూ అనుకోని ప్రమాదంలో తనువు చాలించాడు. ఉదయం ఆయన తన సొంత వాహనంలో బఠిండాకు వెళ్తుండగా…హర్యానా సోనిపట్ జిల్లా పరిధి ఖర్ ఖౌదా సమీపంలో ఆయన స్కార్పియో ఓ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడున్న వాళ్లు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సిద్దూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయనతో పాటు కార్లో ఉన్న ఓ మహిళ ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు సిద్దూ.
గతేడాది సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో సిద్దూ పాల్గొన్నాడు. ర్యాలీ సందర్భంగా హింసను ప్రేరేపించింది ఆయనేననే ఆరోపణలు వచ్చాయి. ఆందోళనకారులను రెచ్చగొట్టి పోలీసులమీదకు ఉసిగొల్పేలా సిద్దూ వ్యవహరించాడన్నది ఆరోపణ. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు కూడా. గతేడాది ఏప్రిల్లో బెయిల్ పై విడుదలైన సిద్దూ ఇప్పుడిలా రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.