పంజాబ్ సర్కారు బాధ్యతారాహిత్యం వల్ల సాక్షాత్తూ దేశ ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. ఎన్నడూ లేనిది ఎస్పీజీ …ఆయుధాలు పట్టుకుని కాన్వాయ్ కి ఇరువైపులా ఆయనకు రక్షణగా నిలవాల్సి వచ్చింది. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పంజాబ్ వెళ్లిన భారత ప్రధానికి ఎదురైన ఈ అనుభవం ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. దీనిమీద కేంద్ర హోంమంత్రిత్వశాఖ సీరియస్ అయింది.
హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రధాని హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి వెళ్లాల్సి ఉంది. వర్షం కారణంగా ఆయన హెలికాఫ్టర్ ను బటిండాలో నిలిపారు. కాసేపు వేచి చూసి వాతావరణం కుదుటపడ్డాక వెళ్దామనుకున్నారు. కానీ ఎంతసేపటికీ వాతావరణం అలాగే ఉంది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది కనుక రోడ్డుమార్గాన వెళ్లాలని నిర్ణయించారు. వెంటనే పంజాబ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రోడ్డు మార్గాన అయితే ప్రయాణ సమయం రెండుగంటలు. డీజీపీ, పంజాబ్ పోలీసులు భద్రతా ఏర్పాట్లు ధ్రువీకరించిన తరువాతనే బయల్దేరారు. పీఎం చేరాల్సిన హుస్సేనివాలా స్మారకానికి 30 కిలోమీటర్ల దూరం ఉందనగా… కొందరు నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ కి అఢ్డుగా వచ్చారు.
అక్కడ పంజాబ్ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రధాని షెడ్యూల్ ,ప్రయాణ ప్రణాళిక ప్రభుత్వానికి ముందే చేరింది. దేశప్రధాని పర్యటనకుతగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి. కానీ అలా జరగలేదు. ప్రధాని వస్తున్న సమాచారం తెలుసుకున్ననిరసనకారులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ప్రధాని వ్యక్తిగత సిబ్బంది కూడా వాహనం దిగి దాదాపు 20 నిమిషాల పాటు వెపన్స్ చేతిలో పట్టుకుని ప్రధానికి రక్షణగా ఉన్నారు. తరువాత ఆయన్ని పంజాబ్ పోలీసుల రక్షణతో బటిండా విమానాశ్రయానికి వెళ్లారు.
ఈ పరిణామంతో ప్రధాని కాస్త అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టుకి చేరిన తరువాత అక్కడున్న పంజాబ్ ఉన్నతాధికారులతో…మీ సీఎంకు ధన్యవాదాలు చెప్పండి..నేను ప్రాణాలతో ఉన్నా, బటిండా ఎయిర్ పోర్టుకు చేరుకున్నానని” అని మోదీ అన్నట్టు సమాచారం.
ప్రధాని పర్యటనలో భద్రతాలోపం పై హోంశాఖ సీరియస్ అయింది. ఈ పరిస్థితికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలనీ కోరింది.
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ కావాలనే పంజాబ్ ప్రభుత్వం ప్రధాని పర్యటనను పట్టించుకోలేదని బీజేపీ మండిపడింది. నిరసనకారులు ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకునేలా ఉద్దేశపూర్వకంగా వారికి అవకాశం ఇచ్చిందని..అనుమతించిందని నాయకులు ఆరోపించారు.
ఇక ప్రధాని కాన్వాయ్ నిలిచిన ఫొటోలు, ఎస్పీజీ సిబ్బంది కారుచూట్టూ రక్షణవలయంగా ఉన్న చిత్రాలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.