జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన PAGD నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మహబూబా, సీపీఎం నాయకుడు మహ్మద్ యూసిఫ్ తిర్గామీ సహా పలువురిని ఇంట్లోనే నిర్బంధించారు.
గుడ్ మార్నింగ్ వెల్కం టు 2022.. కొత్త సంవత్సరం సందర్భంగా జమ్ముకశ్మీర్ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. జమ్ము ప్రజల్ని ఇళ్లల్లో ఉంచి తాళాలేస్తున్నారు. ఇళ్లముందు ట్రక్కులను పార్క్ చేశారు. ఇలాంటి చర్యలతో మీరేం చేయలేరు అని తండ్రితో కలిసి ఉన్న ఫొటోను జతచేస్తూ ట్వీట్ చేశారు ఒమర్ అబ్దుల్లా.
అసలు రాష్ట్రంలో చట్టం అమలవుతోందా… మా గేట్లకు తాళాలు వేశారు. నా తండ్రి ఇంటిని, నా సోదరి ఇంటిని కలిపే ఇంటర్నల్ గేటుకు కూడా తాళం వేశారు చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటాం. కానీ ఈ పరిస్థితి చూడండి అంటూ…ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న వాహనాల్ని, తాళం వేసి ఉన్న గేటు ఫొటోలను షేర్ చేశారు.
జమ్ముకశ్మీర్ ప్రజలు ఎప్పుడు నిరసనకు దిగాలనుకున్నా కేంద్రం ఇలాగే చేస్తుందని మరో నాయకురాలు మహబూబా ముఫ్తీ విమర్శించారు.
జమ్ముకశ్మీర్ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కేంద్రం 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. ప్రజలు ఎప్పుడు తమ అభిప్రాయం వ్యక్తం చేసేందుకు బయటకు రావాలనుకున్నా అసహనంతో కేంద్రం ఇలాంటి పనులు చేస్తుంది. ఇప్పుడు మమ్మల్నిలా హౌస్ అరెస్ట్ చేసింది అని ముఫ్తీ ట్వీట్ చేశారు.,
కనీసం మాకు శాంతియుత నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వడంలేదని జమ్ముకశ్మీర్ కమ్యూనిస్టు నాయకుడు తరిగామి అన్నారు.
కొత్త సంవత్సరం వేళ ప్రజాస్వామిక వాదుల గొంతుల్ని కేంద్రం నులుముతోంది. డిలిమిటేషన్ కమిషన్ సిఫార్సుకు వ్యతిరేకించే హక్కు మాకు లేకుండా పోయింది. మొత్తం PAGD నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారని ఆయన ట్వీట్ చేశారు.
శాంతియుత నిరసనల్ని ఆపడం ద్వారా కేంద్రం హింసాత్మక నిరసనల్ని ప్రోత్సహిస్తోందని ఇతర పీఏజీడీ నాయకులు ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యం తమకు ఇచ్చిందన్నారు.
మేం నిరసనలకు దిగకుండా ఆపడానికి సరైన కారణాలేవీ కనిపించడం లేదు. ప్రభుత్వ చర్యలపై పునరాలోచించుకోవాలి అని నాయకులు అభిప్రాయపడ్డారు.
అటు నాయకులను గృహనిర్బంధంలో ఉంచడంపై నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. డీలిమిటేషన్ కమిషన్ ముసాయిదా ప్రతిపాదనలను నిరసిస్తూ ఆయా పార్టీల కార్యాలయాల్లో విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగించారు. ఆగస్టు 5, 2019న కేంద్రం రద్దు చేసిన ఆర్టికల్ 370 , 35-Aని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Good morning & welcome to 2022. A new year with the same J&K police illegally locking people in their homes & an administration so terrified of normal democratic activity. Trucks parked outside our gates to scuttle the peaceful @JKPAGD sit-in protest. Some things never change. pic.twitter.com/OeSNwAOVkp
— Omar Abdullah (@OmarAbdullah) January 1, 2022