ఉత్తరప్రదేశ్ లోని భరూచ్ జిల్లా కంకరియా అనే గ్రామంలో 37 గిరిజన కుటుంబాలను మతం మార్చారు. డబ్బు, ఉద్యోగం, పెళ్లి వంటి వాగ్దానాలిచ్చి ప్రలోభపెట్టి హిందువులను ఇస్లాంలోకి మార్చారనే ఆరోపణలతో తొమ్మిది మందిపై కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుల్లో హాజీఅబ్దుల్లా పేరు ఉంది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గతంలో బహిర్గతం చేసిన ఉత్తరప్రదేశ్ సామూహిక మత మార్పిడి రాకెట్లో ఇతను కీలక వ్యక్తి.
ఫెఫ్దావాలా హాజీ అబ్దుల్లా, ఫెఫ్దావాలా అబ్దుల్ , అబ్దుల్ ఫెఫ్దావాలా పేర్లతో పిలిచే ఇతను బెరూచ్ నబీపూర్ కు చెందినవాడు. కొన్నేళ్లుగా యూకేలో ఉంటూ…యూకే ఆధారిత సంస్థ మజ్లిస్-ఎ-అల్ఫాలాతో అనుబంధం కలిగి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.
2019 అక్టోబర్ లో అతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయోధ్య నుంచి కరసేవకులు, సాధువులు వస్తున్న రైలుకు నిప్పుపెట్టి వారిని సజీవ దహనం చేయడం, తరువాత గుజరాత్ వ్యాప్తంగా అల్లర్లు రేగడం గురించి తెలిసిందే. నాటి నుంచి ఎక్కడకెళ్లినా గోద్రా అల్లర్ల గురించే మాట్లాడుతుండేవాడని పోలీసులు చెబుతున్నారు. క్రైమ్ బ్యూరో ఏసీపీ డీఎస్ చౌహాన్ నివేదిక ప్రకారం, ఫెఫ్దావాలా… అల్లర్లగురించి చెబుతూ నాడు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఊచకోత కోశారని…మహిళలపై అత్యాచారాలు చేశారని…పిల్లలను హత్య చేశారని పలు వేదికలపై ప్రచారం చేస్తుండేవాడు.
2003లో యూకేలో ఓ ట్రస్ట్ ను స్థాపించి…అక్కడ 125 మంది దాతల ద్వారా భారత్ కు విరాళాలు పంపడం మొదలు పెట్టాడు. ఇస్లాం కమ్యూనిటీని బలోపేతం చేయడానికి, తమ జనాభాను పెంచేందుకు అంటూ విరాళాలు సేకరిస్తూ వస్తున్నాడు. జనాభా పెంచుకోవడం ద్వారా మాత్రమే ముస్లింలు తమను తాము రక్షించుకోగలమనీ చెప్పేవాడు. గుజరాత్ లో ఓ వేదికనుంచి ముస్లిం సమాజాన్ని ఎలా బలోపేతం చేయాలనేదానిపై గంటపాటు ప్రసంగించాడు.
హవాలా, మత మార్పిడికి పాల్పడి ఇటీవల అరెస్టయిన సలావుద్దీన్ షేక్ , ఉమర్ గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫెఫ్దావాలా గత 18 ఏళ్లలో భారతదేశానికి రూ. 150 కోట్లకు పైగా ‘విరాళాలు’ చేరవేసినట్టు తెలిసింది.
వడోదరాలో నగరానికి చెందిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ఆరిజిన్ చారిటబుల్ ట్రస్ట్ …బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింల కోసం 4 వందల ప్లాట్ల నిర్మాణం కోసం హవాలా నిధులు తరలించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ గతేడాది అక్టోబర్లో తేల్చింది. ఘజియాబాద్ సమీపంలో… ఇండో-నేపాల్ సరిహద్దు సమీపంలో మౌల్వీలకు కూడా ఈ నిధులు సమకూర్చినట్టు వార్తలు వచ్చాయి.
ఈ ట్రస్ట్ ట్రస్టీల్లో సల్లావుద్దీన్ షేక్ ఒకడు. ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రభావితమైన ఇతడు ట్రస్ట్ ను ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. ఫెఫ్దావాలా 2017లో షేక్ని ఉమర్ గౌతమ్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత, CAA వ్యతిరేక నిరసనల గురించి చర్చించడానికి వారు వడోదరలో అనేకసార్లు కలుసుకున్నారు. యూపీ ఏటీఎస్ కేసులో మరో నిందితుడు కలీమ్ సిద్ధిఖీ కూడా ఫెఫ్దావాలా, ఉమర్ గౌతమ్లను కలిశాడు. CAA వ్యతిరేక నిరసనల నేపథ్యంలో రోహింగ్యాలు, ఇతర బంగ్లాదేశ్ ముస్లింలకు ఇళ్లను నిర్మించడానికి ముంబై, దుబాయ్లోని వ్యాపారవేత్తల సహాయంతో ఫెఫ్దావాలా హవాలా ద్వారా డబ్బును మళ్లించాడని ఏసీపీ చౌహాన్ తెలిపారు.
ఫెఫ్దావాలాతో పాటు మౌల్వీ జకారియాకు నిధులు ఇచ్చినట్లు షేక్ ఒప్పుకున్నాడు. ఫెఫ్దావాలాకు పరిచయస్తుడైన షబ్బీర్ అనే వ్యక్తిని కశ్మీర్లో కలిశాడు. గౌతమ్, షేక్లు ‘పేద ప్రజలకు సహాయం చేయడానికి’ షబ్బీర్కు రూ. 5 లక్షలు పంపినట్లు అంగీకరించారు. అయితే ఇవి ఉగ్రవాద నిధులేనని అనుమానిస్తున్నారు. ఇంకా, హవాలా ద్వారా వచ్చిన డబ్బు భారతదేశంలోని మాలేగావ్, మాల్దా, అస్సాం, బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు నేపాల్ కూ తరలించారని తెలిసింది.
ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం, 2017 నుంచి సుమారు 14 విదేశీ ట్రస్ట్లు AFMI ఛారిటబుల్ ట్రస్ట్లో సుమారు రూ. 19 కోట్లను డిపాజిట్ చేశాయి. గుజరాతీ ముస్లిం అసోసియేషన్ 7.44 కోట్లు ట్రాన్స్ ఫర్ చేసింది. ఫెఫ్దావాలా కు చెందిన మజ్లిస్-ఎ-అల్-ఫలా ట్రస్ట్ రూ. 2.06 కోట్లు బదిలీ చేసింది. షేక్కు హవాలా మార్గంలో డబ్బు చేరవేసేందుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త ముస్తఫా థానావాలాకు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు.