ఏసు తప్ప మరో దేవుడు లేడని..డబ్బాశ చూపి, బెదిరిస్తూ మతమార్పిడి చేసే ప్రయత్నం చేసిన నలుగురు క్రైస్తవ బోధకుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెహోర్ జిల్లా గురాడికి చెందిన మనోహర్ బన్సల్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
బన్సల్ ఇంటికి వెళ్లి.. డబ్బు ఆఫర్ చేసి మతం మారాలని కోరారు ఆ నలుగురు. అతను ఒప్పుకోకపోవడంతో బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో స్థానికులకు సమాచారం ఇచ్చిన బన్సల్ నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. అంతకుముందు గ్రామ కూడలి దగ్గర పలువురిని సమావేశపరిచి ఏసు మాత్రమే దేవుడంటూ ప్రచారం చేశారని గ్రామస్తులంటున్నారు. దాదాపు నెలరోజులుగా వాళ్లు గ్రామంలోకి తరచూ వస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ పిల్లలకు ఉచితవిద్య, మంచి జీతంతో కూడిన ఉద్యోగం,ఉచిత వైద్య సదుపాయం వంటివి కల్పిస్తామని ఆశచూపినట్టు వారంటున్నారు.
నిందితులను తాగ్రాజ్, రాజారామ్ మాల్వియా, సునీల్ మాల్వియా మరియు తేజ్ సింగ్లుగా గుర్తించారు. మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్ 3 , 5 కింద వారిపై కేసు నమోదు చేశారు. సవరించిన మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం కింద ప్రలోభపెట్టి మతం మార్చడం, నమ్మించి పెళ్లి చేసుకుని మతం మార్చడం వంటివి చేస్తే శిక్షలు తప్పవు. ఎస్సీ, ఎస్టీలు, మైనర్లను భయపెట్టి మతమార్పిడికి పాల్పడినట్టు రుజువైతే రెండు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, 50 వేల జరిమానా విధిస్తారు.