రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జాయిన్ కానున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రాగాంధీ. సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు కేరళలో జరిగే యాత్రలో ఆమె రాహుల్ తో కలిసి పాల్గొంటారు. సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా పాదయాత్ర చేపట్టనున్నారు.
రాహుల్ గాంధీ పాదయాత్రపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య విమర్శలు ఉధృతం అవుతున్నాయి. యాత్రలో రాహుల్ 41 వేల రూపాయల విలువైన టీషర్ట్ ధరించారంటూ బీజేపీ ఓ పోస్ట్ పెట్టింది. అది సోషల్మీడియాలో వైరల్ అయింది. అయితే దానికి కాంగ్రెస్ సైతం ధీటుగా బదులిచ్చింది. దేశంలోని నిరుద్యోగం సహా ఇతర సమస్యలపై మాట్లాడకుండా…రాహుల్ టీషర్ట్ మీద మాట్లాడడమేంటని కౌంటర్ ఇచ్చింది. అంతే కాదు బీజేపీవాళ్లు బట్టలపై చర్చిద్దామంటే తాము సిద్ధమేనని మోదీ ధరించిన సూట్ ధర 10 లక్షలంటూ కౌంటర్ ఇచ్చింది.
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో చేసిన ఓ పోస్ట్ పై రగడ మొదలైంది. ఆర్ఎస్ఎస్ యూనిఫాం నిక్కరును తగులబెడుతున్న ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే యాత్ర అనే క్యాప్షన్ ఉంది. బీజేపీ, సంఘ్ నుంచి దేశాన్ని కాపాడుతామని…ఒక్కో అడుగుతో ఆ లక్ష్యాన్ని చేరుతామనిట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఈ ట్వీట్ పై మండిపడింది బీజేపీ. అటు ఆర్ఎస్ఎస్ సైతం స్పందించడం విశేషం. గతంలో సంస్థపై అకారణంగా నిషేధం విధించారని…అయినా దేశ ప్రజల మనసులు గెలుచుకుంటూ సంఘ్ విస్తరిస్తోందన్నారు డాక్టర్ మన్మోహన్ వైద్యా. సత్యం, సిద్ధాంతం, త్యాగం, పరిశ్రమ, బలిదానం ద్వారా సంఘ్ సమాజం మద్దతు పొందుతోందన్నారు.
ఇక యాత్ర సందర్భంహా రాహుల్ సహా నాయకులు వాడుతున్న లగ్జరీ కంటైనర్లపైనా బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక పాల్టర్ జార్జి పొన్నయ్యతో రాహుల్ జరిపిన సంభాషణ వీడియోసైతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా? అని రాహుల్ అడగ్గా… ఏసు మాత్రమే నిజమైన దేవుడు అనిపొన్నయ్య బదులిచ్చాడు.
గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ ను రాహుల్ కలవడంఏంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.