ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఒక ప్రైవేట్ పాఠశాల ఆ ప్రాంతంలోని స్థానిక ముస్లింలకు శుక్రవారాన్ని ‘హాఫ్ డే’గా ఏకపక్షంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై స్కూల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ హిందూ సంస్థల సభ్యుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. డెహ్రాడూన్లోని వికాస్నగర్ జిల్లాలో ఉన్న బ్రైట్ ఏంజెల్ పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. స్కూల్ డైరెక్టర్ MK హుస్సేన్, అజ్రా హుస్సేన్ దాని ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. MK హుస్సేన్ మాజీ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్. ఆ తర్వాత ఉత్తరాఖండ్ ముస్లిం ఎడ్యుకేషనల్ లా బోర్డు చైర్మన్గా కూడా చేశారు.
పాఠశాల సాధారణ సమయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. గురువారం పిల్లలు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వారి డైరీలలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాల ముగుస్తుందని సూచించారు. ఎందుకంటే శుక్రవారం జుమ్మా నమాజ్ సమయం సాధారణంగా మధ్యాహ్నం 12 నుంచి 1:30 మధ్య ఉంటుంది. స్కూల్ యాజమాన్యం తీసుకున్న పక్షపాత నిర్ణయాన్ని పలువురు తల్లిదండ్రులు వ్యతిరేకించారు. విషయం తెలుసుకున్న హిందూ సంస్థలు పాఠశాల నిర్ణయాన్ని వ్యతిరేకించాయి.
“స్కూల్ మేనేజర్ ముస్లిం వర్గానికి చెందినవాడు. మత ఛాందసాన్ని ప్రచారం చేస్తున్నారు. అన్ని మతాల పిల్లలు బడిలో చదువుతున్నారు. పాఠశాల యాజమాన్యం యొక్క ఈ చర్య ఉత్తరాఖండ్ విద్యా వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది” అని హిందూ జాగరణ్ మంచ్ ఆఫీస్ బేరర్ రాకేష్ తోమర్ అన్నారు.
స్కూల్ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హిందూ రక్షా సేన అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి.. హరిద్వార్ నుంచి వికాస్నగర్కు వెళ్లినట్లు సమాచారం. “ఇది పాఠశాల కాదు, జిహాదీల, పాకిస్తాన్ ఏజెంట్ల కర్మాగారం. ఈ వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపాలి. రాజస్థాన్లోని ఉదయపూర్లో కన్హయ్య లాల్కు ఏం జరిగిందో మనం అందరం చూశాము. అది ఇక్కడ కూడా జరగొచ్చు. పాఠశాల యాజమాన్యం దేవభూమి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తోంది” అని ప్రబోధానంద గిరి మండిపడ్డారు.
స్కూల్ కు సీలు వేయాలని.. దానిలో కొనసాగుతున్న హాస్టళ్లు, ఇతర కార్యకలాపాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. స్వామి ప్రబోధానంద గిరి స్కూల్ అధికారులపై జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం)కి ఫిర్యాదు చేశారు. దీంతో డీఎం, ఎస్డీఎంను విచారణకు ఆదేశించారు.
వికాస్నగర్ SDM స్కూల్ మేనేజర్ తన కార్యాలయానికి పిలిపించి సమాధానం కోరగా, వారిద్దరూ వెంటనే తమ క్షమాపణలు తెలిపారు. స్కూల్ సిబ్బంది సౌలభ్యం కోసం తీసుకున్న ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్కూల్ యాజమాన్యం నిర్ణయించింది.