ఈరోజు అసోంలోని కర్బీ-ఆంగ్లాంగ్ జిల్లా ప్రధాన కార్యాలయ పట్టణమైన డిఫు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరింగ్-తేపి గ్రామంలో శాంతి, ఐక్యత సహా అభివృద్ధిపై భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
యువత ఉగ్ర మార్గాన్ని విడనాడి దేశాభివృద్ధికి పాటుపడాలని, గత ఏడాది సెప్టెంబర్లో ఈ జిల్లాలోని ఆరు మిలిటెంట్ గ్రూపులతో కుదిరిన శాంతి ఒప్పందం ఈ ప్రాంతంలో దశాబ్దాల నాటి మిలిటెన్సీ సమస్యలను పరిష్కరించిందని మోదీ చెప్పారు. చారిత్రాత్మక శాంతి ఒప్పందం కింద 1,000 మందికి పైగా మిలిటెంట్లు హింసను విరమించుకుని సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరారని, లొంగిపోయిన మిలిటెంట్లందరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోందని ఆయన అన్నారు.
అంతకుముందు జిల్లాకు పశువైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, రెండు మోడల్ డిగ్రీ కళాశాలలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ విద్యాసంస్థలు స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలతో పాటు మెరుగైన విద్యను అందజేస్తాయని.. స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద, శాంతి ఒప్పందంలో భాగంగా ఈ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం సహా అసోం ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను అందజేస్తాయని మోదీ తెలియజేశారు. జిల్లా, అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గిరిజన ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, కర్బీ అంగ్లాంగ్ జిల్లా అతి తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన జిల్లాగా అవతరించనుందని ప్రధాన మంత్రి అన్నారు.
అస్సాంలో శాంతి, భద్రతాపరంగా సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని, ఫలితంగా రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిందని, అతి త్వరలో ఈశాన్య రాష్ట్రాలు మిలిటెన్సీ నుంచి విముక్తి పొందగలవని ప్రధాని ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా ఉన్న అసోం సరిహద్దు సమస్య కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో త్వరలో పరిష్కారమవుతుందని మోదీ తెలియజేసారు.
అసోం కోసం కర్బీ-అంగ్లాంగ్ జిల్లాలో ‘అమృత్ సరోవర్ స్కీమ్’ను ప్రధాన మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,985 కమ్యూనిటీ చెరువులు నిర్మించనున్నారు. ఈ కమ్యూనిటీ చెరువుల ద్వారా గ్రామీణ ప్రజలకు నీరు, ఆదాయం లభిస్తుంది.
ర్యాలీని ఉద్దేశించి అసోం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి ఈ ప్రాంతాన్ని సందర్శించడం కర్బీ-అంగ్లాంగ్ జిల్లాకు చారిత్రాత్మక క్షణమని అన్నారు. శాంతి ఒప్పందంలో భాగంగా ఈ జిల్లాలో విశ్వవిద్యాలయం, విమానాశ్రయం కూడా వస్తాయని ఆయన తెలియజేశారు.
తర్వాత, దిబ్రూగఢ్లోని అసోం మెడికల్ కాలేజీకి చేరుకున్న ప్రధాని.. దిబ్రూగఢ్ క్యాన్సర్ హాస్పిటల్, మరో ఆరు క్యాన్సర్ కేర్ హాస్పిటల్ లను జాతికి అంకితం చేశారు. ఆయన డిబ్రూఘర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరో ఏడు క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్కు వర్చ్యువల్ గా శంకుస్థాపన చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)