ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్జీ ప్లాంట్ ను ఫిబ్రవరి 19 నాడు మధ్యప్రదేశ్ లో ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.
ఇండోర్ పరిధి దేవ్ గుడారియాలో మొత్తం 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 15 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్ ను నిర్మాణం పూర్తైంది. 550 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ ప్లాంట్ ను మోదీ వర్చువల్ గా ఆవిష్కరించనున్నారు.
వ్యర్థాల నుంచి ఉత్పత్తయ్యే బయో సీఎన్జీతో ఇక్కడి 400 బస్సు సర్వీసులను నడపడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తారు.
ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక శనివారం నాటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల స్వచ్ఛ మిషన్ భారత్ డైరెక్టర్లూ హాజరుకానున్నారు.
డంప్ యార్డ్ గా ఉన్న ట్రెంచింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్ద బయో మిథనేషన్ ప్లాంట్ కానుంది. ప్లాంట్ 550 టన్నుల తడి వ్యర్థాలైన పండ్లు, కూరగాయలు, పచ్చి మాంసం, పాడైన ఆహారం, ఆకుపచ్చ ఆకులు, పువ్వుల ద్వారా రోజుకు 19,000 కిలోల బయో-CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో కొంత భాగాన్ని 400 బస్సులకోసం వినియోగించనున్నారు.