రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ
ప్రధాన నరేంద్ర మోదీ రాజ్యసభలో భావోద్వేగానికి గురయ్యారు. రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశిస్తూ.. ప్రధాన మోదీ మాట్లాడారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్తో ముగియనుంది. దీంతో ఆజాద్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. గులాం నబీ ఆజాద్ తన ఆప్తమిత్రుడని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ సీఎంగా ఆజాద్ ఉన్న సమయంలో ఆయన చేసిన సహాయాన్ని మరిచిపోలేనంటూ గుర్తు చేసుకున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో అక్కడ గుజరాత్ పర్యాటకులు చిక్కుకున్నారని.. ఆ సమయంలో తాను ఆజాద్ వద్ద సహాయాన్ని కోరానని తెలిపారు. వెంటనే స్పదందించిన గులాం నబీ ఆజాద్ పర్యాటకుల గురించి ప్రతి క్షణం వారి క్షేమ సమాచారాన్ని తెల్పుతూ.. వారిని గుజరాత్ చేరేలా సహాయం చేశారని గుర్తుచేసుకున్నారు.
గుజరాతీ పర్యాటకులను ఆజాద్ రక్షించినట్లు చెప్పుకొచ్చిన మోదీ.. కొన్ని క్షణాల పాటు తన దుఖాన్ని ఆపుకునేందుకు ప్రయత్నించారు. స్వంత కుటుంబీకుల కోసం తాపత్రయం పడిన రీతిలో ఆజాద్ స్పందించారని.. ఆయన చేసిన సహాయాన్ని గుర్తుచేస్తూ.. ఆయనకు సెల్యూట్ చేశారు. ఉన్నత పదవులు ఎన్నో వస్తుంటాయి.. పోతుంటాయని.. కానీ గులాం నబీ ఆజాద్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని మోదీ అన్నారు.