భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు ప్రధాని మోదీ.
“భారతదేశ ఐక్యతను పెంపొందించడానికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన అసమానమైన కృషికి ప్రతి భారతీయుడు ఆయనకు రుణపడి ఉంటారు. భారతదేశ పురోగమనం కోసం ముఖర్జీ చాలా కష్టపడ్డారు.. బలమైన, సంపన్న దేశం ఆయన ఎన్నో కలలు కన్నారు. ఆయన కలలను నెరవేర్చడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.
“బెంగాల్ను రక్షించడానికి.. కశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా ఉంచడానికి చేసిన పోరాటంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతి భారతీయులు రుణపడి ఉంటారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన బలమైన రాజకీయ నాయకుడని భావించారు. ఆనాటి ప్రభుత్వ ఆలోచనలు, విధానాలతో దేశ సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార ఆనందాన్ని త్యజించి సుదీర్ఘ పోరాటాల సంక్లిష్ట మార్గాన్ని ఎంచుకున్నారు.
దేశ ఉజ్వల భవిష్యత్తు దాని స్థానిక సంస్కృతి, ఆలోచనల బలమైన పునాదిపై మాత్రమే సాధ్యమవుతుందని ముఖర్జీ విశ్వసించారు. అందుకే ఆయన సాంస్కృతిక జాతీయవాదం, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని దేశం ముందుంచారు. నేడు ఆయన ఆలోచనలే దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాయి” అని అమిత్ షా అన్నారు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ స్థాపకుడు, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఇండస్ట్రీ అండ్ సప్లై మినిస్టర్ గా పనిచేశారు.
లికాయత్ అలీ ఖాన్తో ఢిల్లీ ఒప్పందం సమస్యపై, ముఖర్జీ అప్పటి క్యాబినెట్ నుంచి 1950 ఏప్రిల్ 6న రాజీనామా చేశారు. తర్వాత 1951 అక్టోబర్ 21న ముఖర్జీ ఢిల్లీలో భారతీయ జనసంఘ్ను స్థాపించి దాని మొదటి అధ్యక్షుడయ్యారు. ముఖర్జీ 1953లో కాశ్మీర్ను సందర్శించడానికి వెళ్లి, మే 11న అరెస్టయ్యారు. 1953 జూన్ 23న మరణించారు.